జనం అందరి సభలకి వెళ్తారు. అభిమానంతోనో, ఆసక్తితోనో, కాలక్షేపంకోసమో.. నాయకృణ్ణి కళ్ళారా చూద్దామనో, అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనో వెళ్తారుకదా! ఇటీవల భీమిలి దగ్గర జరిగిన వైసీపీ వాళ్ళ సభ చూసినపుడు ఆ తేడా ఏమిటో తెలిసింది. పాటల, కోలాహలం, నృత్యాలూ, నినాదాలు సరే . వేదిక మీదికి జగన్ వచ్చినప్పుడు, పోటెత్తిన జనంలో పొంగిన ఉత్సాహాన్నిచూడాలి. క్రాస్ సెక్షన్ అంటాం కదా, సామాన్యులు, కూలీలు, నిరుపేద జనం, మధ్య తరగతివాళ్ళు, అన్ని వర్గాల మహిళలు, రైతులు, చిన్నవ్యాపారాలు.. ఇలా సమాజంలోని సకల కులాల వాళ్ళు కిటకిటలాడారు. జనశ్రేణుల అభిమానం భీమిలి సముద్ర కెరటాలై ఎగసిపడిన సన్నివేశం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అసలే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్ సభకి జనం రావడంలో విశేషం ఏముంది అనొచ్చు. అసలు విషయం ఏమిటంటే, జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల తర్వాత నుంచి తెలుగుదేశం వారి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు ఎదురు దాడి మొదలు పెట్టాయి.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అపరాత్రి జగన్ దొంగ అని, ఫాక్షనిస్ట్ అని, అవినీతిపరుడనీ, హంతకుడని, క్రిస్టియన్ అని ప్రచారం చేసాయి. జైలునుంచి వచ్చాడు, మళ్ళీ జైలుకే పోతాడని నెత్తిన నోరు పెట్టుకుని అరిచాయి. రాజధాని లేకుండా పోయిందనీ, అభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్రం ఎడారిగా మారిపోయిందనీ, వందల వ్యాసాలు, సంపాదకీయాలు రాశాయి. టీవీల్లో చర్చలు అంటూ జగన్ ని తిట్టిపోశాయి. జగన్ సంక్షేమ పథకాల వల్ల పేద జనానికి, మహిళలకూ, రైతులకూ, చేతివృతుల వారికి నేరుగా డబ్బు అందుతుండడంతో జగన్ వ్యతిరేక మీడియా పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయి, ప్రతీదాంట్లో లోపాలు వెతికి భూతద్దంలో చూపించాయి. దాదాపు ఐదు సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా ఇంత దుష్ప్రచారం జరిగాక, జగన్ సభకి జనం అసలు రాకూడదు.
అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, మరోవైపు ఎల్లో మీడియా, కొత్తగా వైఎస్ షర్మిల నాలుగువైపుల నుంచి జగన్ కి ఊపిరి ఆడకుండా భీకరమైన దాడి చేశారు. జగన్ ని దింపేస్తాం, ఇంటికి పంపిస్తాం అని బెదిరింపులకు దిగారు. ఇంత జరిగినా జగన్ సభకి జనం వెల్లువలా రావడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్ కి ఉన్న జనాదరణ ఏమాత్రమూ తగ్గలేదని తెలిసొస్తుంది . అదే సమయంలో బాబు సభలలో జనం వస్తున్నా, వాళ్ళలో ఆ జోష్ కనిపించడం లేదు. చంద్రబాబు అరిచిగగ్గోలు పెడుతున్నా జనంలో స్పందన అంతంత మాత్రంగానే వుంది. గమనించారా పవన్ కళ్యాణ్ సభల్లోనైనా జనంలో ఒక ఊపు, ఉద్వేగం కన్పిస్తున్నాయి కానీ చంద్రబాబు సభలు చప్పగా, ఉప్పు లేని పప్పులా ఉంటున్నాయి. ఇది దేనికి సంకేతం?
ఉత్తరాంధ్రలోని భీమిలిలో జగన్ సభ ప్రభా వెల్లువతో పరవశించిపోయింది. ఇక రెండో సభ పశ్చిమ గోదావరి జిల్లాలో జరగబోతోంది. త్వరలోనే ఏలూరు సమీపంలో జరగబోతోన్నఈ సభకు సీఎం జగన్ హాజరవుతున్నారు. మూడు లక్షల 60 వేల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. త్వరలోనే అవి వాళ్ళ సొంతం కాబోతున్నాయి అక్క చెల్లెళ్లకు ఇది అన్న కానుక అంటున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికల ముందు జగన్ బల ప్రదర్శనే ఏలూరు సభ. తప్పక చూడండి. గమనించండి. దుష్ప్రచార తుఫాన్ని తట్టుకుని విజయకేతనం ఎగరేస్తున్న ఒక యువనాయకుడి సత్తా ఏంటో తెలుసుకోండి. రాబోయే ఎన్నికల ఫలితం ఏమిటో మీకు ఈజీగా తెలిసిపోతుంది.