తెలుగుదేశం, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకు భారతీయ జనతా పార్టీ ఆమోదం లేదు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్పై నమ్మకం లేక హస్తిన పెద్దలు దూరం జరిగారు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్టాపిక్గా ఉంది. మేనిఫెస్టో పత్రాన్ని పట్టుకునేందుకు బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అయితే అసలు సీన్లోనే లేరు. దీంతో కూటమిలోని పార్టీల మధ్య లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
వాస్తవానికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కాంగ్రెస్ది. కర్ణాటకలో దానిని చూపించే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలోనూ పవర్లోకి వచ్చింది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోసం పనిచేసిన సునీల్ కనుగోలును బాబు ఏపీలో టీడీపీ కోసం పనిచేసేలా ఒప్పించాడు. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ను ఇక్కడి మేనిఫెస్టోలో పెట్టారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే సీఎంలు చేతులెత్తేసిన పరిస్థితి. ఈ వైనంపై అక్కడ బీజేపీ పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఆ పథకాలను ఏపీలోకి చంద్రబాబు తీసుకురావడం కమలం పెద్దలకు పెద్దలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అవి నెరవేర్చలేరని చెప్పినా బాబు పట్టించుకోకుండా మేనిఫెస్టోలో పెట్టేశారు. దీంతో బీజేపీ సీనియర్లు చాలా కోపంగా ఉన్నారు. దేశంలో చాలా పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకుంది. ఎన్నికల సమయంలో స్థానిక పార్టీలతో కలిసి కేంద్ర మంత్రులు లేదా పార్టీ చీఫ్ మేనిఫెస్టోను విడుదల చేసేవారు. కానీ ఏపీలో అలా జరగలేదు. కేవలం పరిశీలకుడిని మాత్రం పంపారు. కాంగ్రెస్ పథకాలు అధికంగా ఉండడంతో దూరంగా ఉండాలని పురందేశ్వరిని ఆదేశించినట్లు తెలిసింది.