ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి.
ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలతో పాటు మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 6 నుంచి 12 సెం.మీ. వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాతో పాటూ ఉత్తరాంధ్రలో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో వాతావరణం దాదాపు పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్ క్రింద ఉండకూడదని, పొలాలు ,ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటనలో పేర్కొన్నారు.