టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ విభిన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ గా నిలవడంతో నిఖిల్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ నిఖిల్ నటించిన స్పై అనుకున్న రీతిలో విజయం సాధించకపోవడంతో మరింత కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు నిఖిల్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం స్వయంభు.. నిఖిల్ కెరీర్ లో 20 వ సినిమాగా స్వయంభు తెరకెక్కుతుంది.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. . 12 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్ను రూ.8 కోట్ల భారీ బడ్జెట్తో షూట్ చేస్తున్నామని, పురాతన కాలం బ్యాక్డ్రాప్లో సాగే యుద్ధ ఎపిసోడ్ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నామని నిఖిల్ యాక్షన్, స్టంట్స్తో సాగే ఈ భారీ వార్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ మరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.