ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు వినిపించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకి కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు అప్లికేషన్ ఇవ్వడంతో వారిని కలిసేందుకు జడ్జ్ అనుమతించారు.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కవితకు నిరాశ ఎదురైంది. ఈనెల 20న సాధారణ బెయిల్ కోసం ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు తీర్పు చెప్పింది.