ఐపీఎల్ – 2024లో భాగంగా 65వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో మిగిలివున్న రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి, ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. దీనితో ప్లేఆఫ్స్కు చేరిన రాజస్థాన్ వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఓడిపోయింది
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది.రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ని అందించాడు .రియాన్ పరాగ్ కి తోడు రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్, టామ్ కొహ్లర్-కాడ్మోర్ 18 పరుగులు చేశారు.పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీశారు. నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ కెప్టెన్ సామ్ కుర్రాన్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు రిలీ రూసో, జితేష్ శర్మ తలో 22 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు తీశారు.పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే రాజస్థాన్పై విజయంతో ఐపీఎల్ 2024లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరింది.
పంజాబ్ విజయం లో కీలక పాత్ర పోషించిన సామ్ కుర్రాన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది