2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు వాడి వేడిగా సాగిన సంగతి తెలిసిందే. అధికార వైరి పక్షాల మధ్య పోటీ ఎంత ఉత్కంఠను రేపిందో చూసాం… అయితే రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు మరొక ఎత్తుగా సాగాయి. కారణం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత పై పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమే… ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలకంటే పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు వాడి వేడిగా సాగాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే కేవలం పిఠాపురంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గపు ఓటర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, గెలుపు సునాయాసంగా సాగుతుంది అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసాడు అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు అనగానే స్థానికంగా కొంతమంది ఔత్సాహికుల మాటలు హడావుడి ఒకింత పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా అనిపించినప్పటికీ స్థానికంగా రాజకీయాల మీద అవగాహన, ఆలోచన ఉన్నవారు మాత్రం వంగా గీతకే పట్టం కట్టినట్టు వదంతులు రావడం తో ఒకసారి గా పవన్ కళ్యాణ్ గెలుపు పై సందిగ్ధత నెలకొంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గెలుపుపై కూటమి పార్టీలలో భయం మొదలైంది.
నిజానికి వంగా గీత సుదీర్ఘకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ ప్రాంత వాసులకు ఎంతగానో మేలు చేసిన ఘనతను దక్కించుకున్న మహిళా నేత. నిర్ణీత వయసు దాటిన మహిళలు పెద్దలు వృద్ధులు ఇతరత్రా ఓటర్లందరూ కులాలకతీతంగా వంగా గీత నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ క్రమం లోనే కేవలం కాపు ఓట్లు మాత్రమే కొలమానంగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ కు ఇతర వర్గాల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించే పరిస్థితి లేదు అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా అయినా ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని కలలు కంటున్న పవన్ కళ్యాణ్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది కాలమే నిర్ణయించాలి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలైన సంగతి తెలిసిందే.