2019లో వీచిన ఫ్యాన్ గాలికి తెలుగుదేశం కొట్టుకుపోయింది. అప్పటి ఎన్నికల ఫలితాలనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదు. 24లో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయనకు వివిధ సర్వేల ఫలితాలు గట్టి షాక్లు ఇస్తున్నాయి. ఈసారి కూడా జగన్ ప్రభంజనం సృష్టిస్తాడని ఆయా సంస్థలు కుండబద్ధలు కొట్టి చెబుతున్నాయి.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆరు జిల్లాల్లో సర్వే చేసి ఈ ఏడాది జనవరి 19న ఫలితాలు వెల్లడించింది. దీని ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 31 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ, జనసేన కూటమికి 20లోపే రావొచ్చు. పొలిటికల్ క్రిటిక్ సర్వే ఫలితాలు ఈనెల 22న విడుదల కాగా ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి 18, టీడీపీ, జనసేన కూటమికి 7 వస్తాయి. అసెంబ్లీ సీట్లు వైఎస్సార్సీపీకి 115 నుంచి 120, టీడీపీ, జనసేన కూటమికి 60 నుంచి 65 మధ్య రావొచ్చు. జన్మత్ పోల్ సర్వే వివరాలను ఈనెల 28వ తేదీన విడుదల చేశారు. దీని ప్రకారం ఎంపీ సీట్లు జగన్ పార్టీకి 18 నుంచి 20, బాబు, పవన్కు 3 నుంచి 4 మాత్రమే వస్తాయి. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే వైఎస్సార్సీపీకి 114 నుంచి 117, టీడీపీ, జనసేన కూటమికి 49 – 51 మధ్య రావొచ్చు. ఫిబ్రవరి 7వ తేదీన టైమ్స్ నౌ విడుదల చేసి సర్వే ఫలితాలను చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్కు 19 ఎంపీ సీట్లు రావొచ్చు. అదే టీడీపీ, జనసేన కూటమి ఆరు సీట్లకే పరిమితం కానుంది.
ఈ సర్వేల ఫలితాలు చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోయారు. టీడీపీ మునిగిపోయిన నావనే భావనకు వచ్చేశారు. దీంతో బాబు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ గెలుస్తోందని సర్వేలు చెబుతున్నాయని ఊరూ పేరూ లేని సంస్థల పేర్లతో అప్పుడప్పుడూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుని తమ వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయని ఆయనకు కూడా తెలుసు. అలాగే ఢిల్లీలోని తన పలుకుబడిని ఉపయోగించి పెద్ద సంస్థలకు డబ్బు ముట్టజెప్పి టీడీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలంటూ ఊదరగొట్టిస్తున్నారు. తమ పార్టీ అంత బలంగా ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా.. తెలుగు తమ్ముళ్ల మొదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఒకవేళ ఇది అడిగితే బాబు సమాధానం చెప్పడు గానీ.. ఏం తమ్ముళ్లూ తమాషాగా ఉందని గద్దిస్తాడంతే. ఆయన బాధ ఆయనది.