పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు బదులు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్లలోనే ఉద్యోగులు తమ ఓటును వేశారు. పోలింగ్ అంత జరిగిన తర్వాత జరిగిన పొరపాటును అధికారులు గమనించారు. ఈ చర్య వల్ల 1219 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో మరోసారి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. దీంతో ఈ రోజు, రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్ కారణమైన సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొదట షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదికి పోస్టల్ బ్యాలెట్ కి అవకాశం ఉంది కానీ ఇవాళ రాష్ట్రంలో మోదీ పర్యటన నేపథ్యంలో మరో రోజు గడువు పెంచుతున్నట్టు ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా ప్రకటించారు. కాగా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించు కోవడానికి 4. 30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.3 లక్షల మంది నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు వినియోగించుకున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.