కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో షర్మిల ప్రభావం కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు ప్రధాన కారణం. దీంతో ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తొలి గ్యారంటీగా రాష్టానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 ఏళ్లు వచ్చేలా చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు.
నవ గ్యారంటీల్లో రెండో గ్యారెంటీ మహిళా మహాలక్ష్మి: ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8,500 ఇస్తామని, ఏడాదికి లక్ష రూపాయలు అవుతుందని షర్మిల వివరించారు. మూడో గ్యారెంటీ గా రైతులకు రుణమాఫీ హామీలో భాగంగా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నాలుగవ గ్యారెంటీ గా పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర అందేలా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇక 5వ గ్యారెంటీ గా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ. 400 రూపాయలు చేస్తామని పార్టీ హామీగా ప్రకటించింది. 6వ గ్యారెంటీ గా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. 7వ గ్యారెంటీగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే ఉంటుందని ప్రకటన చేసింది.
8వ గ్యారెంటీగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ. 5 లక్షలతో పక్కా ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక..9వ గ్యారెంటీగా ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ 6 వేలు పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. వైసీపీ, టీడీపీ పోటా పోటీ సంక్షేమ హామీలు ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ పూర్తిగా సంక్షేమ హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. దీని ద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అస్త్రంగానే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ కు పోటీగా చంద్రబాబు సైతం సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించారు. దీంతో.. ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.