తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలలో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు వీలుగా ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
వాస్తవానికి తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది కానీ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. ఆమె వృత్తిరీత్యా గైనకాలజిస్ట్. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించిన తమిళిసై 2006 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2009 లోక్సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీచేసి ఓటమి పాలైన తమిళిసై, 2019 లోక్సభ ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి అన్నాడీఎంకే కూటమి తరపున పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి చవిచూశారు.
తదనంతరం కేంద్రం 2019లో తమిళిసైని తెలంగాణ గవర్నర్ గానూ, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గానూ నియమించింది. తమిళిసై కి కేసీఆర్ ప్రభుత్వం మధ్య దూరం పెరగడంతో బహిరంగంగా విమర్శించి వార్తల్లో నిలిచారు. కాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగాలని బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. అనంతరం ఈరోజు గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీసారి ఓటమి పాలైన తమిళిసైకి ఈ ఎన్నికల్లో అయిన విజయం దక్కుతుందో లేదో వేచి చూడాలి.