రాయలసీమ కరువు గురించి, దుర్భిక్షం గురించి ఒక్క కథైనా రాయని కథకుడు ఉండరు. తరతరాలుగా కరువుతో, కక్షలతో మగ్గిపోయిన రాయలసీమ ప్రాంతం ముఠాదారుల పెత్తనం కింద నలిగిపోయింది. అభివృద్దికి దూరంగా మిగిలిపోయింది. అయితే ఇది గతం.. కారణం నేడు గతానికి భినంగా ఆలోచించే నాయకులు పాలకులవ్వడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంత అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఒకపక్క సంక్షేమాన్ని అందిస్తూనే మరోపక్క యువత, ముఠాదారుల వెనక పోకుండా ఉండేలా ఆ ప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపించి యువతకి ఉద్యోగం, ఉపాధి అవకశాలు కల్పించారు. జగన్ గారి పాలనలో ముఖ్యంగా కరువు నేలగా పిలవబడే రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్దిలో మైలురాయిగా బద్వేలులో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోనే అతిపెద్ద ఉడ్ ప్యానల్స్ తయారీ సంస్థగా పేరొందిన సెంచురీ ప్యానల్స్ సంస్థను చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు జగన్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్సుల విధానం లాంటి అనేక పారిశ్రామిక ప్రోత్సాహాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ విధానాలకు ఆకర్షితులై తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా బద్వేల్ లో తమ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని చెబుతూ 2021 ఆగస్ట్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసిన సెంచరీ ప్యానల్స్ సంస్థ సంస్థ అధినేతలు సజ్జన్ భజాంకా,కేశవ్ భజాంకాలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకునివెళ్ళే ఆలోచనతో ఉన్న జగన్ గారు వెంటనే వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయించి వేగంగా అనుమతులు అందేలా చర్యలు తీసుకున్నారు. జగన్ గారు చూపిన చొరవతో సెంచరీ ప్యానల్స్ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేస్తూ జగన్ గారి ఆద్వర్యంలో 2021 డిసెంబర్ 23న ఫేస్ 1 పనులు ప్రారంభిస్తూ శంఖుస్థాపన చేసింది. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి, అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పించబోతునట్టు ప్రకటించింది.
పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించడంతో పాటు పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ లాంటి అన్ని అనుమతులూ క్లియర్ చేయడంతో పరిశ్రమ యాజమాన్యం సైతం రికార్డు స్థాయిలో కేవలం రెండేళ్ళలోనే పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ముఖ్యమంత్రి జగన్ గారి సమక్షంలో ప్రారంభించి, ఉత్పత్తి మొదలుపెట్టారు.
ఒక భారీ పరిశ్రమ రాష్ట్రంలో ఇంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. గతంలో ఎన్నడులేని విధంగా వేగంగా పరిశ్రమ ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం ప్రభుత్వం చూపిన చొరవగా చెప్పుకోక తప్పదు. అంతేకాకుండా ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధితో పాటు ఈ పరిశ్రమకు ముడిసరుకుగా భారీ స్థాయిలో కలప అవసరం పడుతున్న దృష్ట్యా 150 కిమీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిప్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించారు. బద్వేల్ అంటే ఒకప్పుడు మట్టి పాత్రలు, కుండలకు, బానలకు, కూజాలు, కాగులకు ప్రసిద్ది. నేడు ముఖ్యమంత్రి జగన్ గారి చొరవతో బద్వేల్ అంటే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ తయారీ కేంద్రంగా మారి పరిశ్రమల పరంగా రాయలసీమకే మకుటంగా నిలిచింది.