మీరు ఎన్ఆర్ఐ అయ్యి ఉండి.. బాగా డబ్బు ఉంటే చాలు.. తెలుగుదేశంలో సంవత్సరాలుగా పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చేస్తారు. ఆయనకు కావాల్సిన మొత్తం ఇస్తే.. సీటు ఇవ్వడానికి ఎంతటి సీనియర్ను అయినా బలి చేస్తారు.
ఎన్నికలంటే చాలు.. టీడీపీలో ఎన్ఆర్ఐలు చేరేస్తారు. అందులోనూ ఓ సామాజికవర్గం వారే అధికంగా ఉంటారు. షెడ్యూల్కు రెండు, మూడునెలల ముందు వచ్చేస్తారు. పార్టీకి దండిగా ఫండ్ ఇస్తారు. అధినేతల ఖజానాకు ఎంతోకొంత వితరణ చేస్తారు. టార్గెట్ చేసిన నియోజకవర్గంలో ట్రస్ట్ పేరుతో టీడీపీ కార్యకర్తలు దుస్తులు, డబ్బు వగైరా పంచుతారు. అప్పటి వరకు పనిచేస్తున్న వారిని కాదని టికెట్ కొట్టేస్తారు. గెలిస్తే కొద్దిరోజులు ఇక్కడ.. కొద్దిరోజులు విదేశాల్లో ఉంటారు. ఓడితే పూర్తిగా జంప్ అయిపోతారు.
2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు బాగా డబ్బున్న ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్వతీపురం నుంచి బరిలో ఉన్న విజయ్ బోనేలా విదేశాల్లో స్థిరపడ్డారు. రాజోలు జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్రావు అంతే. చింతలపూడి నుంచి బరిలో ఉన్న సొంగా రోషన్ విదేశాల్లో వ్యాపారం చేస్తుంటాడు. ఇక్కడ పోటీ చేయాలని మాజీ మంత్రి పీతల సుజాత బాగా ప్రయత్నించారు. కానీ బాబు టికెట్ను రోషన్కు అమ్మేసినట్లు విమర్శలున్నాయి.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ ఎన్నికలకు ఆరునెలల ముందే వచ్చారు. ట్రస్ట్ పేరుతో హడావుడి చేశారు. దీంతో లోకేశ్ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును కాదని కాకర్లకు టికెట్ ఇప్పించారు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఫారిన్లో వైద్య విద్యార్థులకు సంబంధించిన కన్సల్టెన్సీ నడుపుతూ బాగా గడించారు. గుడివాడ నుంచి పోటీలో ఉన్న వెనిగళ్ల రాము అర్హత కూడా ఎన్ఆర్ఐ కావడమే.
స్థానిక నాయకులైతే డబ్బు ఖర్చు పెట్టలేకపోవచ్చని ఒక కారణమైతే.. ఎన్ఆర్ఐలు తమకు బాగా ముట్టజెబుతారని చంద్రబాబు, లోకేశ్ వారిని ప్రోత్సహిస్తున్నారు. టికెట్ ఇచ్చిన సమయంలో స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్నా నగదు ఇచ్చి నోళ్లు మూయిస్తున్నారు.