రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పడం, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం అసలు సాధ్యమయ్యే పనేనా అని పేర్ని నాని ప్రశ్నించారు.
13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచ్చిందో ఈసీ చెప్పాలని ప్రశ్నించారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, దీనిపై మేము అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పడం, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారు? చివరికి కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఈసీ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవన్నారు.
టీడీపీ ఎన్డీఏతో కలిసి ఈసీ చట్టాలను చుట్టాలుగా మార్చుకుంది, న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో ఉన్న ఎన్నికల సంఘం, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారు, కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారం పైనా పోరాటం చేస్తాం, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని పేర్ని నాని వెల్లడించారు.
టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైసీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని ఆయన ఈసీ పై ధ్వజమెత్తారు