2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా మీరెవరూ రుణాలు తిరిగి చెల్లించొద్దు అన్న చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలు తమ బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీలు అపరిమితంగా పెరిగిపోవడమే కాక, నిరర్ధక బకాయిలుగా బ్యాంక్ లు ప్రకటించే పరిస్థితి వచ్చింది . ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ద్వాక్రా రుణమాఫీ చేయకుండా రాష్ట్ర మహిళల్ని వంచించడంతో రాష్ట్ర మహిళా లోకం నివ్వెరపోయింది. టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో పొదుపు సంఘాలన్నీ దాదాపు పతనావస్థకు చేరుకున్నాయి.
2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్ ఆసరా పథకంతో వాటికి మరలా ఊపిరి పోసి తిరిగి గాడిలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుంది. పొదుపు సంఘాల మహిళలను ఆదుకుని వారికి అండగా నిలబడ్డ జగన్ తీరును చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ సత్యదూరమైన విమర్శలు చేస్తూ అభాసుపాలవుతుంది. తాజాగా నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత వైఎస్సార్ ఆసరా పథకాన్ని టోకరా పధకంగా విమర్శించి నవ్వులపాలయ్యారు.
సీఎం జగన్ ఇచ్చింది వైఎస్సార్ ఆసరా కాదు టోకరా అని విమర్శించిన పరిటాల సునీతే డ్వాక్రా రుణమాఫీ అంశం అసలు ప్రభుత్వ పరిశీలనలో లేదని నాడు అసెంబ్లీలో ప్రకటించింది. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని అబద్దపు హామీలు గుప్పించి అసెంబ్లీ సాక్షిగా మహిళలకు టోకరా వేసిన సునీత, టీడీపీ ఎగ్గొట్టిన రుణాలను చెల్లించి పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచిన సీఎం జగన్ పై విమర్శలకు తెగబడడం ప్రజలంతా ఖండించాల్సిన విషయంగా చెప్పొచ్చు.
కాగా పొదుపు సంఘాల మహిళలను ఆదుకుంటానని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ 2019 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులుండగా 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు అయింది. ఈ అప్పును నాలుగు విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా పొదుపు సంఘాల రుణాలను నాలుగు విడతల్లో చెల్లించి 7.98 లక్షల డ్వాక్రా సంఘాలకు ఊపిరిలూదారు.
సీఎం జగన్ నాలుగు విడతల్లో అందించిన డ్వాక్రా రుణాలు
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు,
లబ్ధిదారుల సంఖ్య 77,87,295
రెండవ విడత, 07 అక్టోబర్ 2021
అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు
లబ్ధిదారుల సంఖ్య 78,75,539
మూడవ విడత, 25 మార్చి 2023
అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు
లబ్ధిదారుల సంఖ్య 78,94,169
నాల్గవ విడత, 23 జనవరి 2024
అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు
లబ్ధిదారుల సంఖ్య 78,94,169
ఇలా వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు.
కాగా వివిధ సంక్షేమ పథకాల కింద మహిళలకు డీబీటీ (డైరెక్ట్ ) ద్వారా నేరుగా 1.81 లక్షల కోట్లు లబ్దిని చేకూర్చిన జగన్ ప్రభుత్వం, పరోక్షంగా నాన్ -డీబీటీ ద్వారా సుమారు 85,312 కోట్ల లబ్దిని చేకూర్చింది. మొత్తంగా 2.67 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం మహిళలకు అందించి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి,సామాజికంగా భరోసా ఇచ్చింది.