పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుంది. పెత్తందారులకు టికెట్లు అమ్ముకున్న వ్యక్తిగా చరిత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మిగిలిపోనున్నారు. పార్లమెంట్ స్థానాల కేటాయింపు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
తెలుగుదేశంలో మనుగడ సాధించాలన్నా.. ఎన్నికల్లో ఆ పార్టీ బీ ఫారంపై పోటీ చేయాలన్నా ధన బలం ఉండాల్సిందే. బాబు, ఆయన తనయుడు లోకేశ్కు డబ్బు మూటలు ఇస్తేనే అవకాశాలు కల్పిస్తారు. శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితా చూస్తే ఇది ఎవరికైనా అర్థమైపోతుంది. ఆర్థికంగా బలవంతులైన లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల గొంతెమ్మ కోరికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. లావుకు నరసారావుపేట, వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ సీట్లను చంద్రబాబు అమ్మేశారు. పార్టీ ఫండ్ కింద పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్లు తెలిసింది.
ఏలూరు ఎంపీ సీటును స్థానికులను కాదని కడప ప్రాంతానికి చెందిన నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్కు కేటాయించారు. ఇతను యనమల రామకృష్ణుడి అల్లుడు. మాగంటి బాబును బాగా వాడుకుని ఇప్పుడు పక్కన పెట్టేయడంతో స్థానిక తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇక్కడ డబ్బే మంత్రమని ప్రచారం ఉంది. విజయవాడ సీటును రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని)కి కట్టబెట్టారు. గుంటూరును ఎన్ఆర్ఐ పెమ్మసారి చంద్రశేఖర్కు ఇచ్చేందుకు భారీగానే వసూలు చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. విశాఖ సీటును బాలయ్య చిన్నల్లుడు విద్యాసంస్థల అధినేత అయిన భరత్కు ఇచ్చారు.
బాపట్ల ఎంపీ స్థానాన్ని ఉండవల్లి శ్రీదేవి ఆశించగా బాబు ఆమెకు వెన్నుపోటు పొడిచి తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్కు ఇచ్చారు. ఈయన వరంగల్లో కమలం పార్టీ తరఫున పోటీకి యత్నించి విఫలమై బాబు వద్ద బాపట్ల టికెట్ కొనుక్కొన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు కొంత నగదును నారా వారు ఎంపీ టికెట్లను అమ్ముకోవడం ద్వారా సమకూర్చుకున్నారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.