సీఎం జగన్ పై విజయవాడ నడిబొడ్డున దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కాగా వైసీపీ శ్రేణులు ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ దాడి అనంతరం తమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. జగన్ తనపై తానే దాడికి వ్యూహం రచించారనే ధోరణిలో టీడీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. గతంలో కోడి కత్తి కేసుకు ముడి పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ప్రారంభించింది.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో 52రోజుల పాటు ఉంచినప్పుడు విషపు దోమలతో కుట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియాతో ఊదరగొట్టించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ శ్రేణులు ప్రచారం చేసాయి. మరోవైపు వారాహి యాత్రలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ పై సుపారీ గ్యాంగ్ లు, బ్లేడ్ బ్యాచ్ లు దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఆ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేసాయి. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ ప్రచారానికి వంత పాడింది.
కానీ మేమంతా బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి మాత్రం అవాస్తవమని జగన్ ఆడిన డ్రామా అని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. బాబును విషపు దోమలతో కుట్టించడం, పవన్ కళ్యాణ్ పై బ్లేడ్స్ తో దాడి చేయడం నిజమని ప్రచారం చేస్తూ మరోవైపు జగన్ పై జరిగిన దాడి అవాస్తవం అంటూ ప్రచారం చేస్తున్న టీడీపీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల రెండు నాల్కల ధోరణి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ కూటమి తీరును చూసి సామాజిక మాధ్యమాల వేదికగా వైసీపీ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఎండగడుతున్నారు..