బీజేపీ టీడీపీ జనసేనల ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా నెల్లూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనిని ఈ కూటమి ఎట్టి పరిస్థితిలోనూ చేయదు అని మండి పడ్డారు. ప్రజలుకు మేలు చేకూర్చే ఎటువంటి పని ఈ కూటమి చేయదు అని పేర్కొన్నారు.
2014 లో ఇదే కూటమి అనేక హామీలు ఇచ్చింది, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ప్రకటించారు 2019 వరకు అధికారంలో ఉన్న కూటమి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేక పోయింది అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ ను స్వీకరించిన అప్పటి ప్రభుత్వం దాని ద్వారా జరిగిన మేలును ప్రజలకు తెలియజేయాలి అని కోరారు. రాష్ట్రానికి ఏమి చేయలేదు అని 2018లో బీజేపీను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేడు ఏ మొహం పెట్టుకోని బీజేపీతో జత కట్టిందిని అడిగారు. కూటమికి రాష్ట్ర ప్రయోజాలు కన్న సొంత ప్రయోజనాలే అజెండాగా ఉన్నాయి అని అన్నారు.
గతంలో మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం అని చెప్పిన మాట వాస్తవం అని కానీ ఎన్డీఏ కూటమికి కేంద్రంలో కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువగా వచ్చింది తద్వారా మా అవసరం ఎన్డీఏ కూటమికి లేకుండా పోయింది అని వెల్లడించారు. కానీ కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు అని , లోక్ సభ ,రాజ్యసభలో మేము అడుగుతున్నాం అని కానీ కేంద్రం అందుకు సహకరించలేదు అని తెలిపారు.