తమ్ముళ్లూ మీకు పుణ్యం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు రండి.. మనం బలవంతులమని చూపించుకోవాలి’ ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇది. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మండలంలో సభ ఏర్పాటు చేశారు. దీనికి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఎన్డీఏలో చేరాక పెడుతున్న తొలి సభ ఇది. దీనిని సక్సెస్ చేసి క్రెడిట్ కొట్టేసేందుకు నారా వారి పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.
కమలం పెద్దల అండ ఇప్పుడు చంద్రబాబుకు చాలా అవసరం. జనసేన కంటే తమకే ప్రజాబలం ఉందని చూపించుకోవడం ముఖ్యం. అందుకే సభలో తెలుగుదేశం జెండాలు ఎక్కువగా కనిపించాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. దీంతో అభ్యర్థులు జనాన్ని తరలించే పనిలో పడ్డారు. పైగా ప్రధాని దృష్టిలో పడలాంటే భారీ జనసమీకరణ చేయాలి. ఇందులో భాగంగా నేతలకు టార్గెట్లు ఇచ్చారు. దీంతో జిల్లాల్లో మీటింగ్లు పెట్టి ప్రజాగళానికి రావాలని తమ్ముళ్లను బతిమిలాడుకుంటున్నారు.
జనసైనికులు, కాషాయ పార్టీ కార్యకర్తలు చాలా వరకు స్వచ్ఛందంగానే వస్తారు. చిక్కంతా టీడీపీ కార్యకర్తలతోనే. చాలామంది సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో డబ్బు, మద్యం ఆశ చూసి తరలించే పనిలో పడ్డారు. దూరాన్ని బట్టి నగదు ఇస్తామని చెప్పారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల వారికి రూ.వెయ్యి, మద్యం, భోజనం.. ఇతర జిల్లాల వారికి రూ.500 ఎక్స్ట్రా. మరో విషయం ఏంటంటే పొత్తులో తామే బలవంతులమని జనాన్ని నమ్మించాలి. అలాగే ప్రధాని మార్కులు కొట్టేసి ఆశీస్సులు తీసుకోవాలి. దీంతో చంద్రబాబు గ్యాంగ్ పడుతున్న తంటాలు వర్ణనాతీతం. ఎంతోకొంత మంది వస్తే చాలు. లక్షల మంది వచ్చారని రాసేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంది.