ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరికలు మరింత ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కండువాలు కప్పించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిన మీ వెంటే నడుస్తామని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పలువురు పార్టీలో చేరారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వారు జగన్ను కలిశారు. టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, టీడీపీ అధికార ప్రతినిధి ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్ మహమ్మద్, మహమ్మద్ ఇలియాస్లకు జగన్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొంది జగన్ మరోసారి సీఎం కావాలని, ఆయనకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని ముఫ్తీ నూర్ మహమ్మద్ దువా చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టడాన్ని ముస్లిం వర్గం జీర్ణియించుకోలేకపోతోంది. చంద్రబాబు తమను మోసం చేశాడని వాపోతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే జగన్ తమకు న్యాయం చేయగలడని వారు నమ్ముతున్నారు. అన్ని జిల్లాల్లోనూ అనేకమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.