సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన జరగక ముందే మరో రాళ్ల దాడి ఘటన జరిగింది. ఈసారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య వాహనంపై నిల్చుని మాట్లాడుతుండగా వెనుక నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో కృష్ణయ్య వీపుపై గాయమైంది.
కాగా రాళ్ళ దాడి అనంతరం కూడా ఆర్.కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు చొక్కాను పైకి లేపి వీపుపైన గాయాన్ని గుర్తించి ఏర్పేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలును చూసి ఓర్వలేక తనపై దాడి చేశారని ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదని ఆర్. కృష్ణయ్య తేల్చి చెప్పారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదని ఇది కేవలం తనపై దాడి కాదని యావత్ బీసీలందరిపై జరిగిన దాడని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారిన టీడీపీ ఇలా రాళ్ళ దాడులకు దిగుతుండడం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ వచ్చిన సీఎం జగన్ పై బోండా ఉమా అనుచరుడు రాయితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయమైంది. గాయంతో కూడా ఆయన బస్సు యాత్రను కొనసాగించారు. మరోవైపు టీడీపీ వ్యక్తులు చేసిన దాడిలో ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి కార్యకర్త మరణించిన సంగతి విదితమే. ఇలా టీడీపీ శ్రేణులు ఓటమి భయంతో దాడులకు దిగుతుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.