నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు కొద్దికాలంలోనే వైసీపీతో విభేదించారు. అనంతరం రెబల్ ఎంపీగా మారి పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన రఘురామకృష్ణంరాజుకు ఆ మూడు పార్టీలు టికెట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాను ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకటించిన రఘురామకృష్ణంరాజుకు మూడు ప్రధాన పార్టీలు సీటు ఇవ్వని నేపథ్యంలో నాకు సీటు ఇవ్వనివాడు పోలవరం కడతానంటే ప్రజలు నమ్ముతారా? ఇచ్చిన హామీలు అమలు చేస్తాడని నమ్ముతారా అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించడంతో రఘురామకృష్ణంరాజుకు సీటు ఇప్పించేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే నరసాపురం ఎంపీ సీటును బీజేపీ శ్రీనివాస వర్మకు కేటాయించిన నేపథ్యంలో ఆ స్థానంలో రఘురామను పోటీకి నిలిపేందుకు బీజేపీ ఒక్క ఆప్షన్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.
ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి కేటాయిస్తే ఆ స్థానం నుండి తపన చౌదరి పోటీ చేస్తారని నరసాపురం సీటు రఘురామకి ఇస్తామని బీజేపీ చెప్పడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఒకవేళ తపన చౌదరికి సీటు ఇస్తే వరుసగా కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇచ్చారన్న అపవాదుతో బీసీ ఓటర్లు ఎదురుతిరిగే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. మరోవైపు రఘురామకృష్ణంరాజు నరసాపురం నుండి పోటీ చేస్తానని ఘంటాపథంగ చెబుతున్న నేపథ్యంలో రఘురామను హైదరాబాద్ పిలిపించుకుని చంద్రబాబు చర్చలు జరిపినట్లు సమాచారం.
ఎంపీ సీటును కేటాయించడంలో తలెత్తిన ఇబ్బందులను వివరించి రఘురామను సముదాయించే ప్రయత్నం చంద్రబాబు చేసారని, ఉండి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు దాదాపు ఖరారు అయినట్లే అని, శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా మొదటినుండీ నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తా అంటూ చెప్పుకున్న రఘురామకృష్ణంరాజు ఉండి అభ్యర్థిత్వం గురించి ఎలా స్పందిస్తారో అనే ఆత్రుత పలువురిలో ఏర్పడింది. మరికొద్దిరోజుల్లో రఘురామ రాజకీయ భవితవ్యంపై క్లారిటీ రానుంది.