ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మరియు ఇతర పార్టీల నుండి పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కల్యాణదుర్గం సీటును అక్కడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబును చీదరించుకుంటూ పలువురు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీని వీడుతున్నారు.
తాజాగా పత్తికొండలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, పలువురు సీనియర్ నేతలు చేరారు. సీఎం వైయస్ జగన్ వారికి వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో టీడీపీ సీనియర్ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై.నారాయణ, మాజీ ఎంపీపీ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె కొల్లప్ప, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ టి సత్యప్ప, జనరల్ సెక్రటరీ(కంబదూరు) పి ఆనంద్ చౌదరి, కళ్యాణదుర్గం రూరల్ జనరల్ సెక్రటరీ కె మల్లిఖార్జున, జనరల్ సెక్రటరీ(శెట్టూరు) ఆదిశేషు, కళ్యాణదుర్గం రూరల్ ఎంపీటీసీ బి. ఓబయ్య, కంబదూరు మాజీ జెడ్పీటీసీ అభ్యర్ధి మంజునాథ్ చౌదరి, శెట్టూరు మాజీ మండల పార్టీ కన్వీనర్ పి రంగనాథ్ శెట్టిలు ఉన్నారు.