‘ఈతూరి చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడం కష్టమే..’ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఆ నియోజకవర్గంలో ప్రతీది చంద్రబాబుకు వ్యతికంగానే ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సాధారణంగా నాయకులతో నామినేషన్ వేయించే బాబు ఈసారి తన సతీమణి భువనేశ్వరిని పంపారు. ఈ మధ్య ఆమె ఎక్కువగా కుప్పంలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ 30,722 ఓట్లకు పడిపోయింది. దీంతో 2024లో ఓటమి భయంతో నారా వారు కూడా అత్యధిక సార్లు పర్యటించారు.
1989 నుంచి చంద్రబాబు దొంగ ఓట్ల సహకారంతోనే కుప్పం నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఈసారి వైఎస్సార్సీపీ దృష్టి పెట్టడంతో 20 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగించబడ్డాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాబు 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్న తన నియోజకవర్గానికి చేసింది శూన్యం. నేతలకు డబ్బు ఇచ్చి పనులు చేయించుకునే వారు. సొంత ఇల్లు కూడా లేదు. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు ఇంటి నిర్మాణం చేపట్టారంటే బాబుకు ఏ స్థాయిలో ఓటమి భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక్కడ నాలుగు మండలాలున్నాయి. అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 72 ఎంపీటీసీలు, 80 సర్పంచ్ స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంది. ఇక మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. దొంగ ఓట్లు తొలగించడం, స్థానిక సంస్థల్లో తమ బలం అంతంతమాత్రంగా ఉండడంతో చంద్రబాబు విజయావకాశాలు సన్నగిల్లాయి. జగన్ అందించిన సంక్షేమ పథకాలు, కుప్పం అభివృద్ధికి నిధులివ్వడం, సాగునీటి సమస్యను పరిష్కరించడం తదితర కారణాలు వైఎస్సార్సీపీకి కలిసి రానున్నాయి.
కుప్పంలో ఓడిపోతే పరువు పోతుందని చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు. అందుకే ఇక్కడి బాధ్యతలను ఎమ్మెల్సీ శ్రీకాంత్కు అప్పగించారు. ఇక బాబు తన భార్య భువనేశ్వరి ఎన్నికలయ్యే వరకు ఎక్కువ రోజులు ఆ ఊరిలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఆమే నామినేషన్ వేశారు. బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గతంలో దూరంగా ఉన్న వీరంతా ఇప్పుడు ఓటమి భయంతో కుప్పం వీధుల్లో తిరుగుతున్నారు. రూ.250 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు టీడీపీ రెడీ అయ్యింది. అవసరమైతే ఓటుకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కుప్పం వాసులను పోలింగ్ రోజున ప్రత్యేక వాహనాల్లో పిలించాలని, వారి ఖర్చులకు నగదు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఇదంతా చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రికి ఎంత కష్టం వచ్చిందోనని తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు.