మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది.
బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు భరత్కు ఇప్పించారు. దీంతో సీనియర్ కమలం కార్యకర్తలు రగిలిపోతున్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉండాలని జీవీఎల్ మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అధిష్టానం తనకే ఇస్తుందని ఆయన భావించారు. కానీ పురందేశ్వరి వల్ల అంతా మారిపోయింది. ఇప్పుడు పార్టీలోని ఓ వర్గం జీవీఎల్కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ పంచాయితీ హస్తినకు చేరింది.
వాస్తవానికి చంద్రబాబు బీజేపీలో తన మనుషులైన పురందేశ్వరి, సుజనా చౌదరి, సత్యకుమార్, సీఎం రమేష్ తదితరులకు టికెట్లు వచ్చేలా చేశాడు. అదే సమయంలో సీనియర్లయిన సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్రెడ్డి తదితరులకు రాకుండా పురందేశ్వరితో కలిసి చక్రం తిప్పాడు. దీనిపై కమలం పార్టీ హస్తిన పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారు. తాజాగా విశాఖలో జీవీఎల్కు అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది. భరత్ను తీసేసి నరసింహారావుకు సీటు ఇవ్వాలని పార్టీలోని ఓ వర్గం ఇప్పటికే జేపీ నడ్డాకు లేఖ రాసింది. పురందేశ్వరి చేసిన నిర్వాకం గురించి ఫిర్యాదు చేశారు. తాజాగా వారంతా ఢిల్లీకి వెళ్లారు. నడ్డా, ఏపీ ఇన్చార్జి అరుణ్ సింగ్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పురందేశ్వరి బంధు ప్రీతితో భరత్నే బరిలో ఉంచేందుకు జీవీఎల్కు వెన్నుపోటు పొడిచే పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎం రమేష్, సుజనా చౌదరి ద్వారా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. ఈ పరిణామాలతో కేడర్ నిరుత్సాహపడిపోయింది. స్వార్థం కోసం చంద్రబాబు కమలం పార్టీతో ఆడుకుంటున్నాడని బాధపడుతున్నారు.