తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గారాల పుత్రుడు లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. 2019లో ఇక్కడి నుంచే పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేశ్ అక్రమాలకు తెరలేపినట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ లావణ్య అనే బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఆమెను ఢీకొట్టాలంటే చాలా కష్టమని బాబు తనయుడికి అర్థమైపోయింది. దీంతో అప్పుడప్పుడూ మంగళగిరి వచ్చి ప్రచారం చేస్తూ మిగిలిన సమయంలో హైదరాబాద్లోనే ఉంటూ కుట్రలకు తెరలేపినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్డీఏలో టీడీపీ చేరిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ను మేనేజ్ చేయొచ్చని లోకేశ్ భావిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుల్లో పనిచేస్తున్న తన సామాజికవర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులను విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టినట్లు తెలిసింది. వీరు సర్వేలు, ఎన్నికలపై అధ్యయనం చేసే ముసుగులో మంగళగిరి నియోజకవర్గానికి వెళ్తున్నారు.
ఓటర్లతో మాట్లాడుతూ డబ్బును కవర్లలో పెట్టి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులైతే సులువుగా తెలిసిపోతుందని వారిని రంగంలోకి దింపారు. తొలివిడతలో రూ.300 కోట్ల పంపిణీయే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. కుటుంబంలో ఓట్లను లెక్కగట్టి ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక చిన్నచిన్న వ్యాపారులకు సాయం పేరుతో ప్రలోభ పెడుతున్నారు. యువతను మచ్చిక చేసుకునేందుకు వారు అడిగినంత పంపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి లోకేశ్కు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చెబుతున్నారు. నామినేషన్ వేసిన తర్వాత మరో రూ.200 కోట్లు పంపిణీ చేసేందుకు ఉండవల్లిలో డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. ఇందులో ఓడిపోయినా పార్టీని పూర్తిగా తన చేతిలో పెట్టుకోవాలంటే మంగళగిరిలో గెలుపు లోకేశ్కు చాలా ముఖ్యం. అందువల్లే విచ్చలవిడిగా డబ్బును మంగళగిరి వీధుల్లో పోస్తున్నాడు. అపార్ట్మెంట్లలో మీటింగ్లు పెడుతూ బహుమతులతో ఎర వేస్తున్నాడు. ఎన్ని చేసినా చినబాబు మరోసారి మంగళగిరిలో ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.