అయిదుగురు ఆశావహుల మద్య దోబూచులాడుతున్న నరసరావుపేట టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఎట్టకేలకు 2019 లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అరవింద బాబే దక్కించుకొన్నారు. టీడీపీ విడుదల చేసిన మూడో లిస్టులో చదలవాడ అరవింద బాబు పేరు ఖరారు అయ్యింది.
2019 లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి పై ముప్పై రెండు వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన చదలవాడ ఆ తరువాత 2022 మార్చ్ వరకూ ప్రజా క్షేత్రంలో కనపడలేదు. ఆ తరువాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టికెట్ రేసులో నిలబడ్డాడు. ఇదే సమయంలో టీడీపీ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర రావులు పార్టీ కార్యక్రమాలు చేపడుతూ టికెట్ కోసం ప్రయత్నాలు చేయసాగారు.
ఈ క్రమంలో బాబు దృష్టిలో పడటానికి కడియాల అన్నా కాంటీన్ పెట్టి కొన్నాళ్ళు ఉచిత భోజనాలు పెట్టి, టీడీపీ మహానాడుకి లక్షల లక్షల చందాలిచ్చి చివరికి సీటు తనకి రాదని అర్ధమయ్యాక రెండు నెలల క్రితం కాంటీన్ ఎత్తేసాడు. మరోవైపు నల్లపాటి టీవీ 5 ఛైర్మెన్ తో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ప్రచారంతో హోరెత్తిoచటంతో పాటు ఇతను కూడా మహానాడు చందాలు భారీగానే వదిలించుకొన్నాడని సమాచారం . కొద్ది కాలం క్రితం టీడీపీ అంతర్గత సర్వేలో ఈ ముగ్గురూ గెలవరనే సమాచారంతో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థి అయితే గెలుస్తాడని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్న వెంకట రెడ్డికి టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొన్నారు.
అనుకోని రీతిలో నరసరావుపేట వైసీపీ ఎంపీ కృష్ణ దేవరాయలు అలిగి పార్టీ మారడం, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బలమైన బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ రావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ తరపున ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కరినైనా బీసీ అభ్యర్థిని పెట్టాలి, లేకపోతే అనిల్ వలన బీసీల ఓట్లన్ని పోతాయని బాబు భావించగా, మెజారిటీ స్థానాల్లో తన సామాజిక వర్గం వారికి ఇప్పించే కోణంలో లావు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
చివరికి ఒకట్రెండు రోజుల్లో విడుదల అయ్యే మూడో లిస్టులో తన పేరు లేకుండా చక్రం తిప్పిన లావు కృష్ణ నరసరావుపేట సీటుని కడియాలకి ఇస్తున్నాడని సమాచారం అందుకొన్న అరవింద బాబు తన సన్నిహితుడు అయిన స్థానిక టీడీపీ నేత పులిమి రామిరెడ్డితో మరో డ్రామాకి తెర లేపాడు. ఆ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టిన రామిరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించటం కోసం బీసీ నేత అరవింద బాబుకి అన్యాయం చేస్తున్నాడని లావు నాటకం మొత్తం బహిర్గతం చేసి ప్రెస్ ఎదురుగానే పురుగుల మందు తాగాడు. ఆ తాగడం కూడా నాటకానికి తగ్గట్టు కొంచెం తాగకుండా షుమారు పావు లీటరు తాగాడని సమాచారం.వెంటనే నరసరావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేసి పరిస్థితి విషమించటంతో గుంటూరు తరలించారు.
అంతిమంగా లావు కృష్ణ దేవరాయలు ఆడిన కుల రాజకీయం, అరవింద బాబు ఆడిన పురుగుల మందు రాజకీయం ముందు ఓడిపోయి టికెట్ అరవింద బాబుకి దక్కింది. ఇరువురి నాటకాల మధ్యలో బలి పశువు అయ్యింది పురుగుల మందు తాగిన పులిమి రామిరెడ్డి .