త్వరలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సిటింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొందర్ని ఎంపీగా పంపుతున్నారు. మరికొందరికి వేరే సెగ్మెంట్లు అప్పజెబుతున్నారు. పలువురికి మరో రూపంలో అవకాశం ఇస్తామని చెప్పి కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యే టికెట్ లేదని ముందుగానే తెలుసుకుని తెలుగుదేశానికి అమ్ముడుపోయారు. మరికొందరు మాత్రం రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించిన జగన్తోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఎల్లో మీడియాకు నచ్చడం లేదు. టికెట్ ఇవ్వకపోతే వైఎస్సార్సీపీలోనే ఎలా ఉంటారు? జగన్ను బాగా తిట్టి టీడీపీలో చేరాలి కదా.. అనే ధోరణలో వ్యవహరిస్తోంది.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్కు ప్రమోషన్ ఇచ్చి నరసారావుపేట ఎంపీ స్థానానికి పంపారు. ఆయన జగనన్న మాటే వేదమని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఆయన వల్లే వచ్చాయని, ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా రెడీ అని ప్రకటించారు. అయితే పచ్చ గ్యాంగ్ మాత్రం అనిల్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగింది. ఆయన పార్టీ మారే వ్యక్తి కాదని తెలిసినా జగన్ సొంత మనుషులే వెళ్లిపోతున్నారని ప్రచారం చేసి తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఎల్లో మీడియాపై అనిల్ మనుషులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నా ప్రయాణం జగనన్న వెంటే..
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా‡ మధుసూదన్యాదవ్ ఖండించారు. తనపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుర్రాకు జగన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఈసారి కనిగిరి ఇన్చార్జిగా దద్దాల నారాయణ యాదవ్కు అవకాశం ఇచ్చారు. దీంతో బుర్రాపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారానికి పూనుకుంది. అయితే ఎమ్మెల్యే గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని తాను ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేశారు. నారాయణ యాదవ్కు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పిన వారి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. మరోసారి కనిగిరి కొండ మీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. జగన్ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యమన్నారు.
సీఎం నిర్ణయాన్ని స్వాగతించి..
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె స్థానంలో అక్కడ సమన్వయకర్తగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.వీరాంజనేయులును సీఎం నియమించారు. ఇక్కడ ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ఎల్లో మీడియా క్యాష్ చేసుకోవాలని చూసింది. అయితే పద్మావతి వారికి గుణపాఠం చెప్పారు. సమన్వయకర్తతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఆయనకు పూర్తిగా సహకరిస్తామన్నారు. టికెట్ వస్తే ఒకలా.. రాకపోతే ఒకలా ఉండే స్వభావం తనది కాదన్నారు. జగనన్నే మళ్లీ సీఎం కావడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
నాయకులకు బాధ లేకపోయినా ఎల్లో మీడియా, చంద్రబాబు తెగ ఫీలైపోతున్నారు. అయితే అది వాళ్ల మీద ప్రేమ అనుకుంటే పొరపాటే.. తమ పార్టీలోకి వస్తే ఉపయోగించుకోవచ్చని ఆశ అంతే.
– వీకే..