దక్షిణాది రాష్ట్రాల్లో ఉజ్వలంగా వెలుగొంది, కరువు సీమలో వేలాది రైతులకు సహకారం అందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి చేయూతనిచ్చిన చిత్తూరు డైరీ చతికలపడి పోవడానికి కారణం ఎవరు?
1970 లలో 12 వేల లీటర్ల సేకరణ సామర్థ్యముతో ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన డైరీ 1974-75 మధ్య కార్పొరేషన్ గా మార్చబడింది.. ఈ డైరీ కారణంగానే కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతాంగం పాడి పరిశ్రమ వైపు మరలడంతో పాలసేకరణ గణనీయంగా పెరిగింది. ఈ ప్రభుత్వ డైరీ పాలవెల్లువను తట్టుకునేందుకు 1977 లో పాలపొడి తయారీ కేంద్రాన్ని నెలకొల్పాల్సివచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సమయం లో చిత్తూరు డైరీ కి పెరిగిన పాల వెల్లువ. దాని తర్వాత విడతల వారీగా పలుచోట్ల పాల శీతలీకరణ కేంద్రాలు కూడా నెలకొల్పారు. 1980 నాటికి కార్పొరేషన్ గా ఉన్న డైరీ ని సహకార సంస్థగా మార్చి పాడి రైతులకు లాభాల్లో వాటా ఇచ్చేవారు.. 12 వేల లీటర్ లతో మొదలైన దాని ప్రస్థానం అజరామరం గా 2.70 లక్షల లీటర్ ల సేకరణ సామర్థ్యానికి చేరుకుని 1993 వరకు భారీ లాభాలతో నడిచింది.. 1993 తర్వాత మెల్లిగా ప్రైవేటు డైరీ సంస్థలు మార్కెట్ లోకి ప్రవేశించాయి. అందులో ముఖ్యమైనది “హెరిటేజ్”…
1995 లో మామకు పోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు తన సొంత వ్యాపారాలను వృద్ధి వేసుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురి చేసి తద్వారా అవి నష్టాల బాట పట్టడంతో ఆ సంస్థలను నష్టాల సాకుతో మూసివేయడం పరిపాటి అయింది. అలా మూసివేయబడిన ప్రభుత్వ రంగ సంస్థలలో చిత్తూరు డైరీ ఒకటి. 2.70 లక్షల సేకరణ సామర్థ్యం పొందిన ఆ సంస్థ 1996-97 సంవత్సరానికి కేవలం 62 వేల లీటర్ల సామర్థ్యానికి పడిపోయింది. ఇలా వరుస ఏడాదులలో సామర్థ్యం తగ్గిస్తూ ఆ సంస్థ ఆస్తుల విలువ అప్పుల విలువ సమానం అయ్యేవరకు వేచి చూసి నష్టాల సాకుతో చిత్తూరు డైరీని మూసివేసింది ప్రభుత్వం.. ఇదంతా జరిగింది కేవలం తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ డైరీ అభివృద్ధి కోసమే. ఒక పక్క లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ప్రభుత్వ రంగ డైరీ మూతపడుతుంటే మరోపక్క తన సొంత సంస్థ దినదినాభివృద్ధి చెందింది అంటే ప్రభుత్వ నాయకుడైన సీఎం గా ఉన్న చంద్రబాబు విఫలం అయినట్లా? లేక ప్రైవేట్ సంస్థ యజమానిగా ఉన్న చంద్రబాబు సఫలం అయినట్లా.. ? ప్రభుత్వ సంస్థల అంతు చూసి తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే బాబు ఇప్పుడు ప్రజల ఆదాయాన్ని మూడింతలు చేస్తా, సంపద శృష్టిస్తా అనడం అత్యంత హాస్యాస్పదం.