ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటును మాత్రం పెండింగ్లో ఉంచింది. మరోవైపు టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిగా పోటీ చేస్తుండగా అనకాపల్లి నుండి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సీటు దక్కించుకున్నారు.
కాగా తాజాగా అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని అనకాపల్లి బరిలో నిలుపుతున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయనను అనకాపల్లి బరిలో నిలపడంతో పోటీ రసవత్తరంగా మారింది. మాడుగుల అసెంబ్లీ స్థానం నుండి బూడి ముత్యాలనాయుడి కుమార్తె ఈర్లి అనురాధ పోటీ చేయనున్నారు.
బీజేపీ తరుఫున అనకాపల్లి సీటును దక్కించుకున్న సీఎం రమేష్ స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోట్లదుర్తి. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయిన సీఎం రమేష్ టీడీపీ ఘోర పరాజయం అనంతరం బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా అనకాపల్లి ఎంపీ సీటు కూడా బీజేపీ కోటాలోకి వెళ్లింది.