తెలుగుదేశం హయాంలో కుదేలైన చేనేతల బతుకుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ వెలుగులు నింపింది. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు బతుకులు వారివి. ఏళ్ల తరబడి మగ్గం నేస్తూ వెన్ను కుంగిన జీవితాలు.. రాత్రింబవళ్లు పనిచేసినా నోట్లోకి కడుపు నిండా తినలేని పరిస్థితులు. అలాంటి వారికి నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాట ఎనలేని ధైర్యం నింపింది. జగన్ శ్రీకారం చుట్టిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం నేత కార్మికులకు అండగా నిలిచింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.24 వేలు అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచింది. ప్రభుత్వ చేయూతతో నేత కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
నేత కార్మికులు చేనేత రంగంలో ఆధునికతను అందిపుచ్చుకోలేక మగ్గాలను వదిలి వేరే వృత్తి చేసుకోలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో చేనేతల అభ్యున్నతే లక్ష్యంగా జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం పథకాన్ని రూపొందించారు. నెలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు అందించాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 2019 డిసెంబర్ 21న పథకాన్ని సీఎం ప్రారంభించారు. 81,024 నేత కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారు. అరకొర ఆదాయంతో జీవించే కార్మికులకు నేతన్న నేస్తం నగదు అండగా నిలిచింది. ఈ సొమ్ముతో తమ మగ్గాలను ఆధునీకరించుకోవడం, మెషీన్లను అమర్చి పనులు వేగవంతం చేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. విద్యుత్ మోటార్ల సహాయంతో సులువైన రీతిలో త్వరగా పనులు పూర్తి చేసుకుంటూ రాణిస్తున్నారు. మరి కొందరు కార్మికులు సొంతంగా పడుగు, పేఠా, జరీ కొనుగోలు చేసుకుని తాము నేసిన చీరలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకునే పరిస్థితికి ఎదిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమ బతుకులు మెరుగుపడ్డాయని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో 2014 – 19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం కూడా చేయలేదు. జగన్ సీఎం అయ్యాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చారు. బలవన్మరణాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. నేతన్నలకు ఇచ్చిన హామీలను బాబు గెలిచాక గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు, ఇంకా మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్లో రూ.1,000 కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామన్నారు. చివరికి మోసం చేశారు. ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తామన్న వారు ఐదేళ్లకు కలిపి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు నేతన్న నేస్తం ద్వారా ఐదు విడతల్లో 80 వేలమందికి పైగా రూ.969.77 కోట్ల సాయం చేసింది. ఇంకా సామాజిక పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఆప్కోకు రూ.468.84 కోట్లు అందించింది. ఇంకా ఇతర పథకాలకు రూ.900 కోట్లపైనే ఖర్చు చేసింది. చంద్రబాబు తన హయాంలో చేసిన మొత్తం ఖర్చు రూ.450 కోట్లు. జగన్ నేతన్నల కోసం రూ.3,706 కోట్లు వ్యయం చేయడం జరిగింది. నేతకు, ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత దుస్తుల మార్కెటింగ్పై దృష్టి పెట్టారు. ఇంతకు ముందులేని విధంగా అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో నేతన్నల దుస్తులను అమ్మే ఏర్పాటు చేశారు. తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపారు. ఐదో విడత కార్యక్రమాన్ని గత సంవత్సరం తిరుపతి జిల్లా చేనేతలకు ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో సీఎం ప్రారంభించారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టామని నాడు ఆయన తెలిపారు.