తెలుగుదేశం ఎన్డీఏలో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థులు ముస్లింల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మాకు జై కొట్టండని, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ పని అవసరమైనా చేస్తామని ఆ వర్గ పెద్దలను బతిమిలాడుకుంటున్నారు.
ప్రధాని నరేంద్రమోదీని మెనార్టీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గత ఎన్నికల సమయంలో సభల్లో ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. 24 ఎన్నికలు వచ్చేసరికి అదే మోదీ పంచన చేరారు. దీంతో ముస్లిం సమాజం టీడీపీపై కన్నెర్ర చేసింది. ఇక వారి ఓట్ల కోసం బాబు అండ్ గ్యాంగ్ రోజుకో వేషం వేస్తోంది. అభ్యర్థులు ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు పడరానిపాటు పడుతున్నారు. ఆ వర్గ పెద్దలు వైఎస్సార్సీపీ మద్దతు తెలుపుతుంటే వెళ్లి కలిసి తమకు జై కొట్టాలని తెలుగు తమ్ముళ్లు అడుగుతున్నారు.
నెల్లూరు నగరంలో మదీనా వాచ్ షోరూమ్ ఉంది. దీని అధినేత ఇంతియాజ్ ఇటీవల వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ నుంచి ఖలీల్ అహ్మద్ అనే సామాన్యుడిని అభ్యర్థిగా నిలబెట్టగా సిటీ నియోజకవర్గంలోని ముస్లిలంతా అతనికి అండగా నిలవాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ అభ్యర్థి నారాయణకు భయం పట్టుకుంది. సిటీలో ఆ వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్న అజీజ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతియాజ్ను బతిమిలాడుకుని ఇఫ్తార్ విందు పెట్టించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అజీజ్ తదితరులు వెళ్లారు. కొందరు ముస్లిం పెద్దల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఇంతియాజ్ను ప్రలోభాలకు గురి చేసి జై కొట్టించారు. మిగిలిన వారితో కూడా మాట్లాడాలని, డబ్బు గురించి ఆలోచించవద్దని చెప్పినట్లు సమాచారం.
ఎక్కడైనా టీడీపీలో ఉన్న ముస్లింలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారని తెలియగానే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మైనార్టీల ఓట్లు చాలా కీలకం కావడంతో వారిని బుజ్జగించి తెలుగుదేశంలో చేరాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రతి నియోజకవర్గంలో జరుగుతోంది. కానీ టీడీపీ గురించి బాగా తెలిసిన ముస్లింలు తాము ప్రలోభాలకు గురికామని, వైఎస్సార్సీపీ వెంటే నడుస్తామని తెగేసి చెబుతున్నారు.