‘నా ఖాజానాలోని కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎవడు పడితే వాడు కట్టలు కట్టలు తీసుకెళ్తున్నాడు. జనంలో మాత్రం పాజిటివ్ వైబ్స్ రాలేదు. అందరూ కలిసి నన్ను ముంచేసేలా ఉన్నారు’ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చిన ఆవేదన ఇది.
బడా పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు నెల్లూరు ఎంపీ, భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ.1,000 కోట్లుగా ఆయన వర్గం చెబుతోంది. అందులో సగం బాబుకు ఇవ్వగా మిగిలిన నగదును అధికార పార్టీ నేతల కొనుగోళ్లకు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వినియోగిస్తున్నారని సమాచారం. ప్రజల్లో అణువంత కూడా బలం లేకపోవడంతో వీపీఆర్ ఎక్కువగా కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. కానీ ఆయన అనుకున్న రిజల్ట్స్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.
మూడు రోజుల క్రితం చంద్రబాబు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు వచ్చారు. హెలిప్యాడ్ వద్ద వీపీఆర్ బాబు కాసేపు విడిగా మాట్లాడుకున్నారు. అధినేతకు చెప్పిన విషయాలను వీపీఆర్ తన సన్నిహితులకు వెల్లడించారు. జిల్లాలో విస్తృతంగా తిరుగుతున్నానని, టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, ఎంత ఖర్చు పెట్టినా గెలుపు కష్టమేనని వేమిరెడ్డి తేల్చేశారట. ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని జనసేన, బీజేపీ కేడర్ అసంతృప్తిగా ఉన్నారని, సహకారం అందించడం లేదని బాబు దృష్టికి తీసుకెళ్లారట. ఒకరిద్దరు చోటా నాయకులు తిరుగుతున్నా విపరీతంగా డబ్బు తినేస్తున్నారని, ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు, టీడీపీలోని అసంతృప్తులు డబ్బు పంపండి.. డబ్బు పంపండని పీల్చి పిప్పి చేస్తున్నారని బాధ పడ్డాడని తెలిసింది.
ఒక్కో అభ్యర్థి గురించి వీపీఆర్ బాబు దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రజలకు అందుబాటులో ఉండడని నారాయణకు పేరుంది. ప్రస్తుతం నెల్లూరు సిటీలో ఇదే చర్చ జరుగుతోంది. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన భూ కబ్జాలు, అరాచకాలు దెబ్బ కొట్టొచ్చు. ఆనం రామనారాయణరెడ్డిపై ఆత్మకూరు తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీలు మారుతుండడంతో టీడీపీ వాళ్లు ఆయనకు సహకరించడం లేదు. కమ్మ సామాజికవర్గమైతే ఆనం రాకను అస్సలు ఒప్పుకోవడం లేదు. ఉదయగిరిలో పోటీ చేస్తున్న కాకర్ల సురేష్.. గెలిచినా.. ఓడినా స్థానికంగా ఉండడని, ఫారిన్ వెళ్లిపోతాడని జనం నమ్ముతున్నారు. కావలి అసెంబ్లీకి పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి వ్యవహారశైలిపై టీడీపీ నేతలు కోపంగా ఉన్నారు. అతని రౌడీయిజనాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. కందుకూరులో ఇంటూరి సోదరుల మధ్య గొడవలు దెబ్బతీసే అవకాశాలున్నాయి. కోవూరులో దినేష్రెడ్డి డబ్బు మాత్రం తీసుకున్నాడు. సహకరిస్తున్నట్లు పైకి నటిస్తున్నాడు. కానీ కేడర్ చేత రచ్చరచ్చ చేయిస్తున్నాడు.
నారా వారు వీపీఆర్కు సర్దిచెప్పి అధికారంలోకి వస్తే మీకు కావాల్సింది చేసుకోవచ్చు. అందరినీ సమన్వయం చేసుకుని ఇప్పుడు ఖర్చు పెట్టండని సలహా ఇచ్చారట. మైనింగ్ ప్రాజెక్టులు అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారట అధినేత. కానీ వీపీఆర్ మాత్రం ఈ అభ్యర్థులపై ఖర్చు పెడితే తాను నిండి మునిగిపోతానని సన్నిహితుల వద్ద వాపోయారని తెలిసింది.
– వీకే..