2014 నుంచి ప్రతి సభలో, సమావేశంలో, సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ను జనసైనికులు, అభిమానులు, చోటా నాయకులు సీఎం.. సీఎం అని అరుస్తూనే ఉన్నారు. కర్ణాటకకు కుమార్స్వామి సీఎం అయినట్లు మా వాడు ఏదో ఒకరోజు ఏపీ ముఖ్యమంత్రి అయిపోతాడని బిల్డప్ ఇస్తుంటారు. కానీ సేనాని మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు. అసెంబ్లీ గేటును తాకి.. మైకు ముందు అధ్యక్షా అనాలని చాలా ఏళ్లుగా కోరిక ఉన్నా తీరే మార్గమే లేకుండా పోయింది. ఇందులో స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది.
2019లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఓటమిని చవిచూశారు. అయితే 2024 వచ్చేసరికి కూడా నియోజకవర్గాన్ని వెతుక్కోలేదు. సర్వేలు చేయించుకుని పిఠాపురం అయితే బాగుంటుందని భావించి చంద్రబాబు నాయుడిని ఒప్పించి బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడే పవన్కు సినిమా మొదలైంది. టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన మనుషులు అడ్డం తిరిగారు. టీడీపీ జెండాలు, కరపత్రాలు తగులబెట్టారు. వర్మ తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ బాబు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడం, ఒకవేళ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గారు. దీంతో పవన్, వర్మ మధ్య సయోధ్య కుదిరింది.
ఇప్పుడు పిఠాపురంలో వర్మ లేకుండా సేనాని రాజకీయం చేయలేకపోతున్నాడు. తనకు ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే టీడీపీ ఇన్చార్జి చెప్పిందే వినాలి. వర్మ 2009లో తెలుగుదేశం నుంచి బరిలో దిగి 45 వేల ఓట్ల రెండో స్థానంలో నిలిచాడు. 2014లో టికెట్ ఇవ్వకపోయే సరికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 97 ఓట్లు సాధించి గెలుపొందాడు. 19లో మళ్లీ టీడీపీ నుంచి బరిలో దిగి 68 వేల ఓట్లతో రెండో స్థానంలో వచ్చాడు. ఇక్కడ పవన్ కంటే వర్మనే బలవంతుడు. దీంతో ఇతని మాట ప్రకారం నడుచుకోవాలి.
వాస్తవానికి పవన్ ఒక పార్టీకి అధినేత. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సినీ అభిమానం ఉంది కానీ పాలిటిక్స్లో ప్రజాబలం లేదు. అందుకే పిఠాపురంలో అడుగుపెడితే వర్మను వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఓటమి భయంతో చివరికి కరపత్రాల్లో కూడా వర్మ ఫొటో వేయించి పంచుతున్నాడు. దీంతో జనసైనికులు చిన్నబుచ్చుకుంటున్నారు. తాము సీఎం కావాలని కోరుకుంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి బాగా దిగజారిపోయాడని బాధపడుతున్నారు. సాధారణంగా ఒక పార్టీ అధినేత కరపాత్రాల్లో ఇలా వేరే నాయకుల ఫొటోలు వేయరు. అభ్యర్థులు మాత్రమే తమ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలు, గతంలో కుటుంబంలో ఎవరైనా రాజకీయంగా ఎదిగి ఉంటే వారి ఫొటోలు వేస్తారు. కానీ పవన్ పిఠాపురంలో పంచుతున్న కరపత్రాల్లో నరేంద్రమోదీ, చంద్రబాబతోపాటు వర్మకు చోటిచ్చాడు. రేపు గృహ ప్రవేశం కూడా ఈ టీడీపీ ఇన్చార్జి చేతుల మీదుగా చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.