పాపం జనసైనికులు.. వాళ్లు భయపడిందే జరుగుతోంది. 19 సీట్లలో సింహ భాగం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే తీసుకుంటాడని, ఆయన మనుషుల్ని సేనలోకి పంపి పోటీ చేయిస్తాడని అనుకున్నారు. తిరుపతి టికెట్ విషయంలో ఇదే జరుగుతుందా అనే అనుమానం వారికి కలుగుతోంది.
పొత్తులో భాగంగా తిరుపతి స్థానం జనసేనకు ఇచ్చారని ఎల్లో మీడియా చెబుతోంది. కానీ పవన్ ఇంత వరకు అభ్యర్థి ఎవరో ఖరారు చేయలేదు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన అభినయ్రెడ్డిని ఢీకొట్టే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చిత్తూరు ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఎన్నో ఆశలతో సేన కండువా కప్పుకొన్నారు. అయితే ఆయన వయసురీత్యా పవన్ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇకపోతే సేనకు చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ అధినేతకు ముఖ్యులే. కిరణ్ చాలా కాలంగా సీఎం, మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలను నోటికి అడ్డూ అదుపు లేకుండా తిడుతున్నాడు. మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జనసైనికుల మెప్పు పొందాడు. దీంతో తనకే టికెట్ ఇస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే హరిప్రసాద్ తనకు చంద్రబాబు ఆశీస్సులున్నాయని, బరిలో నేనే ఉంటానని చెబుతున్నారు.
వీళ్లందరికీ షాక్ ఇచ్చారు బాబు మనుషులు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పవన్తో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే గంటా నరహరి అనే తెలుగు తమ్ముడు సేనలో చేరి టికెట్ కొట్టేద్దామని చూస్తున్నారు. ఇంకా గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు నాయకులు పవన్ను కలిశారని ప్రచారం జరుగుతోంది. దీంతో తన వాళ్లకు ఇవ్వాలో.. బాబు పంపింపే మనుషులకు ఇవ్వాలో అర్థంగాక అయోమయస్థితిలో సేనాని ఉన్నారు.
అసలు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ లేదా ఆయన అన్న నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే బీజేపీతో పొత్తు ఓకే అయితే వాళ్లు తిరుపతి సీటు ఇవ్వాలని కోరే అవకాశముందని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం ఇక్కడ తన మనిషే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. దీనికి కారణం సొంతూరైన చంద్రగిరికి సమీపంలోనే తిరుపతి ఉంది. ఏ రకంగా చూసినా ఈ టికెట్ టీడీపీ ఖాతాలోకే వెళ్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.