TDP : తెలుగుదేశం నాయకుల మధ్య కొద్దిరోజుల నుంచి అసెంబ్లీ టికెట్ల వార్ నడుస్తోంది. తమకు ఇవ్వకపోయినా ఓకే గానీ.. (TDP)ఫలానా వాడికి మాత్రం వద్దంటూ ఏకంగా సమావేశాలు పెట్టి మరీ బలప్రదర్శనలు, ర్యాలీలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన నేతలకు సీటు ఇస్తే సహించేది లేదని మరికొందరు బెదిరించినంత పని చేస్తున్నారు. దీంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితీ రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ సీటు తనకే ఇవ్వాలంటూ బుద్ధా వెంకన్న ర్యాలీ చేశాడు. అయితే పొత్తులో భాగంగా తమకే కేటాయించాలని జనసేన నాయకుడు పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నాడు. అధినేత పవన్ కళ్యాణ్పైనే ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా వెస్ట్ సీటు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు జలీల్ ఖాన్ లైన్లోకి వచ్చాడు. మైనార్టీ అస్త్రాన్ని తీసి ఆ కోటాలో ఇవ్వాల్సిందే అంటున్నాడు. లేకపోతే ఉరేసుకుంటానని బెదరింపులకు దిగుతున్నాడు.
ఇక్కడిలా..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో వీడేలా లేదు. మాజీ మంత్రి కేఎస్ జవహర్కు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. అతను గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాండంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఫ్లెక్సీ విషయంలో జవహర్, మరో వర్గం మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘటనను మర్చిపోకముందే మరొకటి చోటుచేసుకుంది. జవహర్కు కాకుండా ఎవరికి ఇచ్చినా సరేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. లేకుంటే పరిణామాలు ఉంటాయని అధినేతకు సంకేతాలు పంపారు.
తెలుగుదేశం నాయకుల మధ్య సయోధ్య లేదు. జనసేనతో పొసగడం లేదు. చాలాచోట్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రి, కేంద్రంలో చక్రాలు తిప్పిన చంద్రబాబును రెండు పార్టీల్లోని చోటా నాయకులు కూడా బెదిరిస్తున్నారు. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలేదాకా బాబు సీట్ల విషయం తేల్చేలా లేడు. కేటాయింపులో తేడాలొస్తే నాయకులు ఓడించడం ఖాయమని ఓ వైపు భయం ఉంది. అయితే ఏమి చేయలేని పరిస్థితి. అందుకని అప్పటి వరకు నేతలంతా తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప మరో పని చేయాల్సిన అవసరం లేదు.