ఏ ముహూర్తాన టీడీపీ వాళ్ళకి పొత్తు పొడిచిందో కానీ, సీట్ల సర్దుబాటులో పార్టీ ఇయర్స్లో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందుల్ని బాబు ఎదుర్కొంటున్నారు. తనకు అలవాటైన పంథాలోనే, నెగ్గలేనివి, కలిసి రానివి అనుకున్న సీట్లను పొత్తులో భాగంగా బీజేపీకి, జనసేనకి కట్టబెట్టేసి, పైకి మాత్రం ఏదో ధారాదత్తం చేసిన విధంగా డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ, లోపల దిగులు అలానే ఉండిపోతుంది.
నీవు నేర్పిన విద్యయే… అన్న చందాన టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకుని, తిరిగి ఆయనకే అప్పచెప్పుతుండంతో కంగు తినడం ఆయన వంతవుతుంది. జనసేనకి ఇద్దామనుకున్న కొన్ని స్థానాల్లో… 2019 లో ఓడిపోయినా ప్రజలలోనే ఉంటూ వచ్చిన స్థానిక నాయకులు ఇప్పుడు ఆ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంతో బాహాటంగానే తమ నిరసన తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఉన్న పార్టీ మేనేజింగ్ (ఆయన అప్పట్లో ఆంధ్రాకి సీయీఓని అని కూడా పిలిపించుకున్నారు లెండి) స్కిల్కి పిఠాపురం సంఘటన ఓ బిగ్ షాక్. అక్కడి స్థానిక నాయకుడు వర్మ తన నిరసనని తారాస్థాయిలో చూపడమే కాకుండా వెంటనే చంద్రబాబు నుంచి పిలుపు వచ్చేలా చూసుకుని, లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, ఆ మరునాడు పవన్ కళ్యాణ్ కు బొకే ఇస్తున్న ఫోటో తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు మార్కు రాజకీయమే.
అదీ కాక, గత అయిదేళ్ళలో టీడీపీ బలహీనపడిందన్నది నిజం. అందుకు సాక్ష్యంగా పదే పొందే పవన్ కళ్యాణ్ కూడా మన సపోర్ట్ టీడీపి కి అవసరం అంటూ బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. పైగా బలమైన నాయకులు టీడీపీకి దూరమవడం, ఉన్న నాయకులు కూడా గెలవలేని పార్టీలో ఉంటూ అంతంత ఖర్చులు ఎందూకు పెట్టుకోవడం అనే ఆలోచనల్లో పడడంతో కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులను కూడా కూడగట్టలేని స్థితిలో చంద్రబాబు పార్టీ ఉంది.
రెండవ విడత జాబితాను విడుదల చేస్తూ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత ఎక్సర్సైజ్ చేసానంటూ చెప్పుకున్న చంద్రబాబు మిగిలిపోయిన స్థానాలకు అభ్యర్థుల విషయంలో మాత్రం మీనమేషాలను లెక్కిస్తున్నారు. పదహారు స్థానాల్లో ఇంకా సందిగ్ధత ఉండగా, అందులో నాలుగు శ్రీకాకుళం జిల్లావే ఉండటం గమనార్హం. అట్టహాసంగా ప్రారంభించిన యువగళం, ఉత్తరాంధ్ర ను కవర్ చేయకుండా అర్ధాంతరంగా ఆపేయడం, ఆప్ చినబాబు శంఖారావం అంటూ అక్కడి నుంచే ప్రారంభించిన సభలు అంతగా సక్సెస్ కాకపోవడం వంటివి… ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన నేతలు దొరకకపోవడం వల్లే అన్నది నిర్వివాదాంశం. అదే ఉన్నట్టయితే, ఎలా అయినా లోకేష్తో యువగళాన్ని అక్కడి వరకూ సాగదీయించి ఉండేవారు.
ఇలా పలురకాల కారణాలతో, ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారయింది బాబు పరిస్థితి. కేవలం పొత్తు మాత్రమే బలంగా కనపడుతూ ఉండటంతో మాట్లాడుతే పొత్తునీ, కూటమినీ చూపిస్తూ తమకి తాము కితకితలు పెట్టుకుంటున్నారు తప్ప, లోపల మాత్రం మొత్తం డొల్లగా ఉంటూ గుబులు పడున్నారు.