ముస్లింలను మంచి చేసుకునే పనిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఫుల్ బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో వారి ఓట్లు పడవనే భయం చంద్రబాబు నాయుడిని పూర్తిగా కమ్మేసింది. దీంతో వారిని మంచి చేసుకోవాలని అభ్యర్థులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ముస్లింలను ప్రలోభ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిన్నారు. కానీ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.
ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించింది. అందులో సీఏఏ ఒకటి. పౌరసత్వ సవరణ చట్టం – 2019ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు మోదీ సర్కారు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైపోయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హైదరాబాద్లో పర్యటించిన సమయంలో తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించారు. బీజేపీ తీరుతో రాష్ట్రంలోని ముస్లింలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎంతో కష్టపడి.. ఎందరినో బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరితే ఇలా అయ్యిందేంటని చంద్రబాబు కొద్దిరోజులుగా బాధలో ఉన్నారు. ఉండవల్లిలో ముస్లిం పెద్దలతో సమావేశాలు పెట్టి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తాను చెప్పని మాటల్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా అన్నట్లుగా వైఎస్సార్సీపీ ప్రచారం చేస్తోందని కవర్ చేయాలని చూశారు. కమలం పెద్దలు అడగడడంతో రాష్ట్రం కోసం ఎన్డీఏలో చేరానని బిల్డప్ ఇచ్చారు. ఈ విషయాలనే క్షేత్రస్థాయిలో చెప్పాలని నేతలను ఆదేశించారు. కానీ ఆ వర్గం నారా వారిని ఎవరూ నమ్మడం లేదు. గతంలో బీజేపీని తిట్టి ఇప్పుడు అవసరం కోసం కౌగలించుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రంజాన్ మాసాన్ని ఉపయోగించుకోవాలని తన అభ్యర్థులకు చెప్పినట్లు తెలిసింది. బహుమతులు ఇచ్చి మంచి చేసుకోవాలని చెప్పారు.
నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందుల పేరుతో ముస్లింలను ఆత్మీయ సమావేశాలకు టీడీపీ అభ్యర్థులు పిలుస్తున్నారు. అయితే ముఖ్యమైన వారెవరూ స్పందించడం లేదు. వచ్చిన వారికి బీజేపీతో పొత్తు వల్ల ఏమీ కాదని, చంద్రబాబు, తాము అండగా ఉంటామని చెబుతున్నారు. ఏమి కావాలన్నా చేస్తామని, ఓట్లు వేయాలని కాళ్లు, గడ్డాలు పట్టుకున్నంత పనిచేస్తున్నారు. కాషాయ పార్టీతో పొత్తు వద్దంటే బాబు వినలేదని, నష్టం జరిగాక.. ఎలాగైనా పూడ్చాలంటే కష్టమని సీనియర్ తెలుగు నేతలు వాపోతున్నారు.