చంద్రబాబు అట్టహాసంగా విడుదల చేసిన టీడీపీ 2024 ఎన్నికల మానిఫెస్టో ఒక అబద్దాల పుట్ట, కాపీల కట్ట తప్ప మరొకటి కాదని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం 2014 మానిఫెస్టోను ఏ విధంగా ఎన్నికల తరువాత చెత్తబుట్టలో పడేసిందో ఈ మానిఫెస్టో గతి కూడా అంతే అనే వాదన ప్రజల్లో మొదలైంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఒక్కటి కూడా చిత్తశుద్దితో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా లేవని, కేవలం అధికారం కోసం జగన్ పధకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వ పధకాలను కాపీ కొట్టి తయారు చేసిన ఒక బిస్మిల్లాబాత్ మానిఫెస్టో అని, ఇచ్చిన హామీని నెలబెట్టుకోలేని చంద్రబాబు చరిత్ర తెలిసిన వారెవ్వరు ఈ టీడీపీ కాపీ పేస్ట్ మానిఫెస్టోని నమ్మరని , కూటమిలో ఉన్న బీజేపీనే ఈ మానిఫెస్టోతో తమకి సంభందం లేనట్టుగా వ్యవహరిస్తుందని ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ది ఏంటో తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
తెలుగుదేశం విడుదల చేసిన మానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలని పోస్ట్ మార్టం చెస్తే అసలు గుట్టు ఇట్తే తేలిపోతుంది. మెగా డిఎస్సీ , జాబ్ క్యాలెండర్ అంటున్న చంద్రబాబు గతంలో తన మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం దండగా అని రాసుకున్న విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు , 3 వేల నిరుద్యోగ బృతి ఇస్తాం అన్న ప్రకటన చూస్తే, 2014లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం , నిరుద్యోగ బృతి , అలాగే 1999లో ఇచ్చిన కోటి ఉద్యోగాలు అంటూ చేసిన మోసం గుర్తుకు రాక మానదు. ప్రతి రైతుకు 20వేల ఆర్ధిక సాయం అంటున్న చంద్రబాబే గతంలో వ్యవసాయం దండగా అనలేదా, ఇస్రాయిల్ టెక్నాలజీ అంటూ రైతుల నెత్తిన టోపీ పెట్టలేదా. కరువుకు తుఫానే మందు అంటూ రైతులని హేళన చేయలేదా. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ ఇస్తున్న రైతు భరోసాని కాపీ కొడితే నమ్మేది ఎవరు ?
ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలండర్లు ఇస్తాం అంటున్న ఇదే చంద్రబాబు 2014 మానిఫెస్టోలోని పేజీ నెంబర్ 17లో ఇచ్చిన హామీ ఒక సారి చూస్తే దీపం పధకం క్రింద అర్హులైన పేద కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం అన్నారు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంటగ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం అన్నారు. ఒక్కటంటే ఒక్క సిలిండర్ సరఫరా చేసిన పాపాన పోలేదు ఇదే చంద్రబాబు. ఇక కర్నాటక, తెలంగాణాలో దారుణంగా విఫలమైన మహిళలకి బస్స్సుల్లో ఉచిత ప్రయాణం పధకం ఇక్కడ తెస్తాం అంటున్నారు. ఉచితాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకా అవుతుంది అన్న ఈ చంద్రబాబు ఇప్పుడు ఉచితాలు ఇస్తాననడం ఊసరవల్లి సైతం సిగ్గుపడే యూటర్న్.
జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ దండగ, గోనె సంచులు మోసే ఉద్యోగం , మగవాళ్ళు ఇళ్ళకి పోయి తలుపులు కొట్టి ఆడవారిని వేదించడం లాంటివే ఈ వాలంటీర్లు చేసే పని అని అవహేళన చేసిన ఇదే చంద్రబాబు అదే వాలంటీర్లకి 10వేలు జీతం ఇస్తాను అనడం తెలుగుదేశం వారినే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇక జగన్ పధకాలైన అమ్మఒడిని తల్లికి వందనం ,మత్య్సకార భరోసా, చేయూత లాంటి పధకాలను మక్కీకి మక్కీ కాపీ చేసి ఇచ్చిన మానిఫెస్టో చివరికి నవ్వులపాలయింది. చంద్రబాబు ఇచ్చిన ఈ మానిఫెస్టో అబద్దాల పుట్ట, సాధ్యం కానీ హామీలతో ప్రజలని మరోసారి మోసం చేయడానికే చంద్రబాబు ఈ చిత్తు కాగితాన్ని వదిలారని బీజేపీ వారు ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్న మాట. అందుకే ఆ మానిఫెస్టో పై తమ ఫోటో కానీ విడుదల సందర్భంగా తమ ప్రమేయం కానీ లేకుండా జాగ్రత్త పడ్డాం అని వారి నోట వినిపిస్తున్న మాట. ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన ఈ టీడీపీ మానిఫెస్టో చివరికి ప్రజలే అబద్దాల పుట్టగా చూస్తున్నారంటే చంద్రబాబు మాటకి ప్రజల్లో ఏమాత్రం విలువ లేదని తేలిపోయింది.