విజయవాడ పశ్చిమ సీటు ఎవరికో ఇంకా తేలలేదు. దీని కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. సేనకు చెందిన పోతిన మహేష్ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. ఈయన పట్టు వీడకుండా పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సేనానిపై నమ్మకం ఉందని చెబుతున్నారు.
తొలుత ఈ సీటును టీడీపీకి చెందిన బుద్ధా వెంకన్న ఆశించారు. ఆయన బల ప్రదర్శనలు కూడా చేశారు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా అనకాపల్లి ఎంపీగా అయినా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో రక్తంతో లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక జలీల్ ఖాన్ కూడా తెరపైకి వచ్చి హంగామా చేస్తున్నారు. తన వర్గంను పంపి టికెట్ అడిగిస్తున్నారు.
సేనకు చెందిన మహేష్ అయితే చాలారోజులుగా ఈ టికెట్ విషయంలో పట్టు వీడడం లేదు. పవన్ మాత్రం అతని విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కూటమిలోని పార్టీలకు విజయవాడ పశ్చిమ అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. తాజాగా తెరపైకి బీజేపీ నుంచి సుజనా చౌదరి వచ్చారు. తొలుత ఈ స్థానాన్ని సేనకు కేటాయించగా పవన్ కమలం పార్టీకి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుజనా బరిలో నిలవాలని భావిస్తున్నారట.
వాస్తవానికి సుజనా పార్లమెంట్కు పోటీ చేయాలని ప్రయత్నించారు. అయితే ఆ చాన్స్ దక్కకపోవడంతో విజయవాడ పశ్చిమం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన టీడీపీకి ప్రధాన ఆర్థిక వనరు. 2019లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాక ఆయన సూచనలతో బీజేపీలోకి వెళ్లారు. కానీ తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు. ఎన్డీఏలో బాబును చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన పోటీకి సై అంటే ఎవరూ అడ్డు చెప్పరు. ఇంకా బాబు, పవన్ అందరికీ సర్దిచెప్పి పక్కకు తప్పిస్తారు. ఇప్పటికే బుద్ధా వెంకన్న సైలెంట్ అయిపోయారు. జలీల్ఖాన్తో ఇబ్బంది లేదు. మహేష్కు పవన్ నచ్చజెపితే వినే పరిస్థితి ఉంది. అందరూ కలిసి సుజనాకు లైన్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో అంతగా అనుభవం, ప్రజా బలం సుజనాకు లేదు. కేవలం డబ్బు మాత్రం ఉంది. దీనితో నెగ్గుకు రావడం అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.