టిడిపి జనసేన సీట్లు ప్రకటన తర్వాత మూడో సభను చిలుకలూరిపేటలో నిర్వహిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట సభలో టిడిపి జనసేన ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ, మేనిఫెస్టోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు.
కాగా సీట్ల ప్రకటన తర్వాత తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా గత నెల 28వ తారీఖున తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జండా సభ అనుకున్న రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాలో సభ జరిగినప్పటికీ జనసేన అత్యంత బలంగా చెప్పుకునే ఆ చోటులోనే జనాలు రాలేదంటే జనసేనని ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో మనం చూడచ్చు. జండా సభ తర్వాత బీసీ డిక్లరేషన్ అంటూ గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన బిసి డిక్లరేషన్ సభ కు కేవలం 10 వేల మంది కూడా హాజరు కాలేదంటే బీసీలకు ఉమ్మడి కూటమిపై ఎంత నమ్మకం ఉందో మనం గమనించవచ్చు. గతంలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ చంద్రబాబు నెరవేర్చకపోగా, చంద్రబాబు ఇచ్చిన హామీలకు తను హామీ అంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హామీలు నెరవేర్చని చంద్రబాబుని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. అలాంటి వీరిద్దరూ జయహో బీసీ అంటూ ఒక సభ పెడితే దాన్ని నమ్మే పరిస్థితిలో బీసీలు ఎవరు లేరు అని చెప్పి మొన్ననే తెలిసి వచ్చింది. ఇలా మొదటి రెండు సభలు అనుకున్న రీతిలో ప్రజల్లోకి వెళ్లకపోవడంతో చిలకలూరిపేట సభ నైనా విజయవంతం చేయాలని చెప్పి అలవిగాని హామీలతో రెడీ అయ్యారు.