తెలుగుదేశం – జనసేన – బీజేపీలు కూటమి అయితే కట్టాయి కానీ.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థంగాక అంతా గందరగోళంగా తయారైంది. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ అత్యాశకు పోయి ఒకే నియోజకవర్గంలో అనేకమందిని ప్రోత్సహించారు. ఈ క్రమంలో అభ్యర్థుల లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఎవరు బరిలో ఉండాలనే విషయంపై ఎంతకూ స్పష్టత రావడంలేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఉదాహరణకు నరసారావుపేటను తీసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థి ఎవరో తెలియక తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
2019లో తెలుగుదేశం నుంచి బీసీ అయిన అరవింద్బాబు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనే ఇన్చార్జిగా ఉన్నారు. 2024లో టికెట్ తనకే ఇస్తారని అనేక కార్యక్రమాలు చేశారు. కానీ అధిష్టానం 2021లో నల్లపాటి రామును తెరమీదకు తెచ్చింది. అంతటితో ఆగలేదు. కడయాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిలో ఆశలు రేపింది. ఒకే సామాజికవర్గానికి చెందిన వీరు పార్టీ కార్యక్రమాలు చేస్తూ టికెట్ ఆశించారు. కడియాల ముమ్మరంగా తిరిగి అన్న క్యాంటీన్ పెట్టి హంగామా చేశారు. అయితే పార్టీ పెద్దల తీరుతో నొచ్చుకున్న ఆయన దానిని తీసేశారు.
వైఎస్సార్సీపీ నుంచి అట్లా చినవెంకటరెడ్డిని చేర్చుకుని టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆయన పేరు ఎక్కువ కాలం రేస్లో లేదు. ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరికతో సమీకరణాలు పూర్తిగా మారాయి. యాదవ సామాజికవర్గం వారికి సీటు ఇవ్వాలని చంద్రబాబు భావించారు. ఎంత జల్లెడ పట్టినా అభ్యర్థి దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సంప్రదిస్తే విముఖత చూపారు. అంతే కాకుండా ఆయన లావు వెంట కూడా వెళ్లలేదు. టీడీపీలో చేరకుండా ఆగిపోయారు. దీంతో అధిష్టానానికి షాక్ కొట్టినంత పనైంది. ఇక అరవింద్బాబే దిక్కని అందరూ అనుకుంటున్న సమయంలో కడియాల వెంకటేశ్వరరావు కోడలు డాక్టర్ లక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. ఈమెకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా వ్యవహరించిన గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె. ప్రస్తుతం నరసారావుపేటకు ఈమె పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇక్కడ కాకపోయినా వెంకటేశ్వరరావును శాంతింపజేసేందుకు దర్శిలో అయినా ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు శిద్ధా రాఘవరావు మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు కలిసి టీడీపీలో చేరి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే శిద్ధాను పార్టీలో చేర్చుకోవద్దని లోకేశ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నరసారావుపేటలో లేదా దర్శిలో సీటు ఇవ్వాలని లక్ష్మి అడిగినట్లు వార్తలొస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల బాధ వర్ణనాతీతంగా ఉంది.