తెలుగుదేశం అదినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పొత్తులో ప్రకటించిన సీట్ల రగడ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. సీట్లు ప్రకటించిన వ్యవహారంలో ఇద్దరు అధినేతలు ప్రవర్తించిన తీరుతో ఇరు పార్టీ నేతల్లో అగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అటు విజయనగరం నుండి ఇటు తంబాళ్లపల్లి వరకు తెలుగుతమ్ముళ్ళు రోడెక్కి చంద్రబాబు తీరును తప్పు పడుతూ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ జాబితాలోకి ఉండి మాజీ ఎమ్మెల్యే వేటూకూరి వెంకట శివరామ రాజు (కలవపూడి శివ) కూడా కలిసారు.
రాజకీయంగా మొదటి నుండి టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఉండి. 1983 నుండి 2019 వరకు ఒక్కసారి మినహ ప్రతీసారి ఇక్కడ ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. 2004లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధి పాతపాటి సర్రాజుకి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశానికి కంచుకోట లాంటీ ఈ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ తరుపున టికెట్ ఆశించేవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇందులో 2009 అలాగే 2014లో గెలిచిన వేటూకూరి వెంకట శివరామ రాజు 2019 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ పార్టీ తరుపున నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటి చేయడంతో ఎమ్మెల్యే అభ్యర్ధిగా మంతెన రామరాజుకు అవకాశం కల్పించారు చంద్రబాబు. అయితే ఈసారి మంతెన రామరాజుని తప్పించి తన సీట్ తిరిగి తనకే ఇస్తారని ఆశలు పెట్టుకున్న శివరామ రాజుకి చంద్రబాబు జలక్ ఇచ్చారు. కనీసం శివరామ రాజును సంప్రదించకుండానే మంతెన రామరాజుకి టికెట్ ప్రకటించేశారు.
చంద్రబాబు తీరుతో తీవ్ర అసహనానికి గురైన శివరామ రాజు తాజాగా చంద్రబాబు పై తిరుగుబాటు బావుట ఎగరేసారు. తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని చంద్రబాబు తీరుని తప్పు బడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకి చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని, తెలుగుదేశం పార్టీకి ఇన్నిరోజులు సేవ చేస్తే నన్ను నడిరోడ్డుపై వదిలిపెట్టారని , ఖచ్చితంగా తాను ఎన్నికలబరిలో ఉంటానని, చంద్రబాబు నేనేంటో చూపిస్తా అంటూ ఘాటుగానే స్పందించారు. టీడీపీకి కంచుకోట లాంటి ఉండిలో తెలుగుదేశం నిట్ట నిలువునా చీలడంతో వైసీపీ సునాయాసంగా ఈ నియోజకవర్గంలో జండా పాతేస్తుందని రాజకీయ విశ్లేషకుల మాట. మరో పక్క శివరామ రాజు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే మరో కధనం కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంది.