ఏమైంది ఈ తెలుగుదేశం పార్టీకీ.. మంచి నేతలుగా పేరొందిన వాళ్ళను కూడా పక్కనబెట్టి సోషల్ మీడియాలో బూతులతో ట్రెండ్ అయి టీవీ డిబేట్లలో బహిరంగ దూషణలకు పాల్పడే వారికి టికెట్లు ఇచ్చే స్థాయికి ఆ పార్టీ ఎందుకు దిగజారిపోయింది? అభ్యర్థుల ఎంపికలో అసలు తప్పు ఎక్కడ జరుగుతుందనే చర్చ ఇప్పుడు టీడీపీ కేడర్ లో విస్తృతంగా జరుగుతుంది. టీడీపీ ప్రకటించిన తొలిజాబితాలో మహాసేన రాజేష్, కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించిన టీడీపీ తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది..
గతంలో ఎందరో దిగ్గజాలకు, మహామహులైన నేతలకు సీట్లను ద్వారా పాపులర్ అయిన వ్యక్తులకు టికెట్లు ప్రకటించిన టీడీపీ ఇప్పుడు బూతులు మాట్లాడితేనే టికెట్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది. లోకేష్ ఎప్పుడైతే టీడీపీ స్టీరింగ్ పట్టుకున్నాడో అప్పుడే టీడీపీలో అట్టడుగున ఉన్న విలువలు కూడా ఎడారిలో నీటి బిందువులా పూర్తిగా ఇంకిపోయాయి. మహాసేన రాజేష్, కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీలో ఎమ్మెల్యే సీటు దక్కడం అనూహ్య పరిణామంగానే చెప్పాలి. అలాగని వీళ్ళు ప్రజాసేవలో తరిస్తున్న నేతలైతే ఏ ఒక్కరికీ పెద్దగా ఆక్షేపణ ఉండేది కాదు. కానీ వీరంతా సోషల్ మీడియా & టీవీ డిబేట్లలో తమదైన బూతులతో రెచ్చిపోయేవాళ్లే కావడంతో వీరి ఎంపికపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. తాజాగా ఎంఎస్ రాజు ఎంపికపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజేష్ మహాసేన మాట్లాడే లకారపు బూతులకు టెంప్ట్ అయి టీడీపీలో టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ టికెట్ ఇచ్చినందుకు తలపట్టుకునే పరిస్థితిని రాజేష్ కల్పించాడు. పి. గన్నవరంలో దేవుళ్లను దూషించినందుకు బ్రాహ్మణ సంఘాలు ఎదురుతిరగడం, గతంలో రాజేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్ర వర్ణ ప్రజలు గుర్రుగా ఉండటంతో రాజేష్ మహాసేన గెలుపుపై ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ ఇంతలో తనకు టికెట్ వద్దంటూ రాజేష్ కొత్త డ్రామాకి తెరతీశాడు. దానివల్ల సింపతీ పెరిగి మళ్ళీ టికెట్ తనకే ఇస్తారనే ఆశతో ఈ డ్రామా కాస్త అడ్డం తిరిగింది. తాజాగా జనసేన అభ్యర్థుల పేరుతొ పి . గన్నవరంలో ఐవిఆర్ఎస్ సర్వే చేయిస్తున్నారంటూ మహాసేన రాజేష్ వాపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొలికపూడి శ్రీనివాసరావు ఓ వర్గం మీడియాలో ప్రతీ రోజు తన నోటికి పని చెప్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకానొక సందర్భంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై ఓ టీవీ డిబేట్ లో లైవ్ జరుగుతుండగానే చెప్పుతో దాడి చేయడం చూసి రాష్ట్ర ప్రజలంతా అవాక్కయ్యారు. అప్పటివరకూ తీవ్ర దూషణలకు పాల్పడుతున్న కొలికపూడి ఆ ఇన్సిడెంట్ తో భౌతికదాడి కూడా చేయగలనని చాటి చెప్పాడు. అనంతరం దర్శకుడు ఆర్జీవీ తల నరికి తెచ్చినోళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని టీవీ డిబేట్ వేదికగా ప్రకటించడం అత్యంత వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై కేసు కూడా నమోదయింది. తనపై తనకి కంట్రోల్ లేని ఇలాంటి వ్యక్తికి టీడీపీ మొదటి జాబితాలో సీటు దక్కడం గమనార్హం.
తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఎంఎస్ రాజును ఖరారు చేసింది. కేవలం అతను మాట్లాడే బూతుల కారణంగానే ఈ ఎంపిక కూడా జరిగిందనే చర్చ నడుస్తుంది. ఎంఎస్ రాజు కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల పేరుతో అభ్యంతరకరమైన భాషలో దూషణలకు పాల్పడే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడీ ఎంపిక కూడా తిట్టే తిట్లను ప్రామాణికంగా తీసుకుని జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి.
గతంలో అభ్యర్థి ఎంపిక అంటే ఆ వ్యక్తికి ఉన్న మంచి పేరు, ఆర్ధిక స్థితిని బట్టి ఉండేది కానీ ఇప్పుడు టీడీపీ మాత్రం బూతులు తిడితేనే సీట్లు ఇస్తాం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపుతుంది. ఓ పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధి కూలీ(ఈర లక్కప్ప), టిప్పర్ డ్రైవర్(వీరాంజనేయులు) లాంటి సామాన్యులకు సీట్లు ఇస్తుంటే టీడీపీ కూడా సామాన్యులకు టికెట్లు ఇస్తున్న పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యంగా మాట్లాడే వారికి పిలిచి మరీ టికెట్ ఇస్తుంది. వీరిలో ఏ ఒక్కరూ టికెట్ ఆశించిన దాఖలాలు లేవు కానీ బూతులు మాట్లాడటమే ప్రామాణికంగా టికెట్లు కేటాయించి టీడీపీ కేడర్ ను నిస్సహాయతలో ముంచేసింది టీడీపీ అధిష్టానం. రాబోయే సంవత్సరాలలో అభ్యర్థుల ఎంపికలో ఇంకెన్ని ఘోరాలను చూడాల్సి వస్తుందో కాలమే సమాధానం చెబుతుంది ..