2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలువకుంటే తమ పార్టీల ఉనికికే ప్రమాదం అని భావించి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. అప్పటికీ ధైర్యం చాలక బీజేపీతో పొత్తుకోసం ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం ఇరు పార్టీలు వెంపర్లాడటం ఆ రెండు పార్టీల దీనావస్థకు నిదర్శనంగా చెప్పొచ్చు. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడీ అభ్యర్థుల ప్రకటన టీడీపీ జనసేన కూటమికి కొత్త తలనొప్పులు తీసుకు వస్తుంది. తొలిజాబితాలో టీడీపీ సీనియర్ లీడర్లకు చోటు దక్కకపోవడం, ఎన్నో ఏళ్లుగా జనసేన తరపున వివిధ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు మొండి చెయ్యి చూపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నాయకుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.
తాజాగా అనకాపల్లి అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించకపోవడంపై అనకాపల్లి అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జి, పీల గోవింద సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న పీల గోవింద సత్యనారాయణ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులు ఆయనను ఓదార్చారు. ఇప్పటికే సమీకరణాల్లో భాగంగా టీడీపీ సీనియర్ & సూపర్ సీనియర్ నాయకులకు కూడా టికెట్ హామీ లభించడం లేదు.
టీడీపీ సూపర్ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, జనసేన నేత కందుల దుర్గేష్ కి మధ్య రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో వార్ జరుగుతుంది. టికెట్ తనకే కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడంటూ కందుల దుర్గేష్ భావిస్తుండగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సామాజిక మాధ్యమాల ద్వారా టికెట్ తనదే అంటూ వెల్లడించడం రాజమండ్రిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవకు కారణమవుతుంది.
తణుకు నియోజకవర్గ అసెంబ్లీ సీటులో విడివాడ రామచంద్రరావును గెలిపించాలంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వెల్లడించగా తణుకు నియోజక వర్గ సీటు తనకే కేటాయిస్తారని తణుకు జనసేన ఇన్ ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ సీటును టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో విడివాడ రామచంద్రరావు ఆగ్రహంతో రగిలిపోతూ ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించే ప్రసక్తే లేదని తన అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు జగ్గంపేట అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడంపై జనసేన పార్టీ నేత పాటంశెట్టి సూర్య చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పవన్ కళ్యాణ్ జగ్గంపేట టికెట్ కేటాయించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగడంసంచలనమైంది. జనసేన కోసం 15 ఎకరాలు అమ్ముకున్నానని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ బీరాలు పలికి తనకు డబ్బు లేదన్న కారణంతో తనకు టికెట్ కేటాయించకపోవడం ఆవేదన కలిగిస్తుందని సూర్యచంద్ర వెల్లడించారు.
మైలవరంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు తొలిజాబితాలో చోటు దక్కలేదు. దాంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మైలవరం నియోజకవర్గ సీటు వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి కేటాయించబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేనియు ఉమా టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్ర రెడ్డిని ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన కార్యాలయంపైన ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను పీకి విసిరేయడం సంచలనంగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు , అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే ,శాసనసభ ఉప సభాపతిగా పని చేసిన మండలి బుద్ధ ప్రసాద్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఎక్స్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. పెడన సీటు దక్కక పోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా అటు టీడీపీలో టికెట్లు దక్కని నేతలు కన్నీరుమున్నీరవుతుంటే ఇటు జనసేన ఔత్సాహికులు బోరుమంటున్నారు. తమ నిరసనను బహిరంగంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నా భవిష్యత్తులో టికెట్ దక్కని నేతల తిరుగుబాటు వల్ల గెలవడం కష్టం అనే ఆలోచన లేకుండా డబ్బు ఎక్కువ ఉన్న అభ్యర్థులకే సీట్లు కేటాయించి డబ్బుతో ఓట్లను కొనొచ్చన్న భ్రమలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పనుల్లో తాము ముందుకుపోతున్నారు.