తెలుగుదేశం పార్టీలో టికెట్ పంచాయితీలు ఇంకా తెగలేదు. రెండు జాబితాలు ఇవ్వగా సీట్లు రాని టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం తంబళ్లపల్లె నియోజకవర్గం స్థానం విషయమై శంకర్ యాదవ్ అనుచరులు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసం వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని సీట్ల విషయమై మంగళవారం హైదరాబాద్, ఉండవల్లిలోని బాబు ఇళ్ల వద్ద నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలూరు నియోజకవర్గ టికెట్ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు వెళ్లారు. బాబును కలుస్తామని చెప్పగా.. పోలీసులు అనుమతించలేదు. మరోవైపు కదిరి టికెట్ అత్తర్ చాంద్బాషాకే ఇవ్వాలని ఆయన వర్గం నాయకులు ఉండవల్లిలోని నారా వారి నివాసం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ స్థానాన్ని అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవికి కేటాయించింది. దీంతో బాషాకు ఇవ్వాలని.. లేకపోతే హిందూపురం ఎంపీగా అయినా అవకాశం కల్పించాలని కోరారు. నేతలు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ను కలిసి మాట్లాడారు. అయితే ఆయన సర్ది చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారు నిరసన తెలుపుతున్నట్లు సమాచారం.
టీడీపీ టికెట్లు ఇస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలువురు నేతలకు ఆశ పెట్టి పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టించారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి వేరే వాళ్లకి సీట్లు అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. తొలి జాబితా ప్రకటించిన నాటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనికితోడు తమకు అవకాశం వస్తుందని జనసేన నాయకులు భారీగా నగదు వెచ్చించి కార్యక్రమాలు చేశారు. కానీ అక్కడ తెలుగు తమ్ముళ్లకు చాన్స్ ఇవ్వడంతో తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.