పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
ఇక తెలుగుదేశం నుంచి ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్కుమార్ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్), వల్లభనేని వంశీ (గన్నవరం)పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పీకర్ పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు. వివరణలు తీసుకున్నారు.
పార్టీల విప్లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్.. 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.