ఎన్నికల్లో తమ ఓటమి తథ్యమని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇక చేసేది లేక ఓర్చుకోలేక ఏకంగా దాడులకి దిగిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు . చిత్తూరు జిల్లా పుంగనూరులో కత్తిపోట్లతో టీడీపీ నేతలు పోలింగ్ రోజును ప్రారంభించి ఎన్నికలు జరుగుతున్నంతసేపు రాష్ట్రంలో ఏదో ఒక మూలన అలజడులను సృష్టిస్తూనే ఉన్నారని, చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారని ఆయన ధ్వజమెత్తారు.
తెలుగుదేశం కార్యకర్తలు ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడినా వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఎంతో సంయమనంతో వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూశారని. 5ఏళ్ళలో జగన్ గారి పాలనలో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ స్వేచ్చగా ఓటు హక్కు వినియొగించుకునే విధంగా వైసీపీ కార్యకర్తలు చూశారని టీడీపీ ఎంత బెదిరించినా భయపడకుండా ఓటర్లకు అండగా నిలబడ్డారని ఈ కారణంతోనే భారీగా పోలింగ్ నమోదయిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూ వచ్చామని, కొన్ని చోట్ల ఖచ్చితంగా పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని, సస్పెన్షన్లో ఉన్న పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వర్లు టీడీపీ ఆఫీసులో కూర్చుని అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ఎస్పీలను బెదిరించినట్టు తమ దగ్గర సమాచారం ఉందని, ఎవరు ఎన్ని చేసిన ఓటరు మాత్రం జగన్ కే మళ్ళీ పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు.