ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి భీమిలిలో జరిగిన సిద్ధం బహిరంగ సభతో సిద్ధంగా ఉన్నామని సమరభేరి మ్రోగించిన విషయం తెలిసిందే. ఆ సభకి కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుండటం విశేషం.
ఈ సభకు మచిలీపట్నం నుండి కార్యకర్తల్ని తరలిస్తున్న ఓ బస్ ని మాజీ మంత్రి పేర్ని నాని నడపడం విశేషం. కార్యకర్తల్లో ఉత్సాహం, జోష్ నింపేందుకు పేర్నినాని మచిలీపట్నం నుంచి ఏలూరుకి బస్సులో కార్యకర్తలను తీసుకెళ్లారు. పేర్నినాని బస్సులో కార్యకర్తలను తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దెందులూరులో జరిగే సిద్ధం సభను 110 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేయగా ఏడు ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలను కేటాయించడం గమనార్హం.