‘ఎన్నికల సంఘం ఈనాడు దినపత్రికకు ఎందుకు లొంగిపోయింది? అందులో వార్తలు రావడం.. సంఘం చర్యలు తీసుకోవడం ఏంటి?.. ఆ పేపర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నో తప్పుడు రాస్తులు రాస్తున్నారు. వాటిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జరుగుతున్న పరిణామాలను చూసి ఎన్నికల వ్యవస్థను రామోజీరావు నడుపుతున్నాడా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది’ అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం నేతలు నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ఎన్నికల కోడ్ను ఉల్లఘిస్తున్నారు. కానీ చర్యలు తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడి కార్యాలయం ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు ఉన్నా ఈసీ పట్టించుకోవడం లేదు. బాబు సతీమణి• భువనేశ్వరి పరామర్శల పేరుతో డబ్బు చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి. వాటిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకివ్వరు.. ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎవరు ఆదేశిస్తే ఈసీ పాక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.
సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అనేది రాజకీయ ప్రేరేపిత సంస్థ. సీఎం జగన్ పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవడానికే చంద్రబాబు దానిని ఏర్పాటు చేయించారు. ఆరు నెలలుగా ఎన్నికలే లక్ష్యంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని వారికి కడుపు మంటగా ఉంది. ఎల్లో గ్యాంగ్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు వలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించింది. కోడ్ వచ్చాక వారికి రూ.50 వేల జీతం వచ్చేలా చూస్తామని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తూనే మరోవైపు కొనసాగిస్తామని చెబుతున్నారు. వలంటీర్లపై వేటు వేయించడం ద్వారా పేదలందరినీ చంద్రబాబు అండ్ కో ఇబ్బందులు పెడుతోంది. మూడు నెలలపాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా పచ్చ బ్యాచ్ కుట్ర పన్నింది. వారి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి.